ఆఫీస్లకు టెక్కీలు.. ఎవరు వస్తారు.. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్? డిసైడ్ చేస్తున్న ఐటీ కంపెనీలు
హైదరాబాద్/బెంగళూరు: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నప్పటికీ ఐటీ సహా అవకాశం ఉన్న రంగాల్లోని వివిధ కంపెనీలు ఇంటి నుండి పనిని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ను డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. ఉద్యోగుల భద్రత, కరోనా వ్యాప్తి నిరోధం కోసం ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ను పొడిగిస్తున్నాయి. అయితే క్రమంగా కొన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని క్రమంగా కొంతమంది కార్యాలయానికి రప్పిస్తున్నాయి.
టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?
15 శాతం ఉద్యోగులు కార్యాలయానికి
లాక్ డౌన్ తర్వాత కొంతమంది అవసరాన్ని బట్టి కార్యాలయాలకు వెళ్తున్నారు. కంపెనీ, ఉద్యోగుల అవసరాలు, ఇబ్బందులు, క్లయింట్స్ డిమాండ్కు అనుగుణంగా టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఎవరిని ఆఫీస్కు రప్పించాలి, ఎవరిని ఇంటి నుండి పని చేయించాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. 200 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమలో లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. ఐటీ సంస్థల్లో 15 శాతం మంది మాత్రమే ప్రస్తుతానికి ఆఫీస్లకు తిరిగి వస్తారని భావిస్తున్నారు.
ఆఫీస్లకు వీరే..
కంపెనీ అవసరాలు, ఉద్యోగుల ఇబ్బందులు, క్లయింట్స్ డిమాండ్కు అనుగుణంగా కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు ఉంటారు. కొంతమంది ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ ఇబ్బందికరంగా మారింది. అలాగే, ఆఫీస్లో కొంతమంది ఉద్యోగులు తప్పనిసరి అవుతారు. ఇందుకు అనుగుణంగా డేటా తయారు చేసుకొని, వారిని కార్యాలయాలకు రప్పించనున్నారు. ఈ రంగంలో దాదాపు 50 లక్షల వరకు ఉద్యోగులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
క్రమంగా ఉద్యోగులను పెంచుతాం
ప్రాజెక్టులు, అందుకు కార్యాలయంలో అవసరమైన ఉద్యోగుల జాబితాను తయారు చేశామని, ప్రభుత్వం అనుమతించినందున, ఉద్యోగులందరినీ కార్యాలయానికి రప్పించమని, ఆఫీస్ నుండి వర్క్ కోసం క్రమంగా ఉద్యోగులను పెంచుతామని టెక్ మహీంద్రా సీఎస్ఓ జగదీశ్ మిత్ర అన్నారు. సురక్షిత వాతావరణంలో వర్క్ జరిగేలా చూస్తున్నామన్నారు. ఇప్పటికే కొంతమంది ఆఫీస్లకు వెళ్తున్నారని, తాను గత నాలుగు వారాలుగా వెళ్తున్నానని, సోషల్ డిస్టెన్స్ వంటి కరోనా నిబంధనలు పాటిస్తున్నామన్నారు.
హడావుడి ఏమీ లేదు
అప్పుడే హడావుడిగా కార్యాలయాలకు రప్పించాలని లేదని, అయితే వర్క్ ఫ్రమ్ హోంతో ఇబ్బందులు పడుతున్న క్లయింట్స్ ప్రాజెక్టుల కోసం మాత్రమే కొంతమందిని రప్పిస్తున్నామని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడ్డాక ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని భావిస్తారని, ఆఫీస్ను కూడా తాము సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు. కాగా, కొన్ని కంపెనీల్లో రెండు శాతం నుండి మూడు శాతం ఉద్యోగులు వస్తున్నారు. ఐటీ కంపెనీలు అన్నీ సామాజిక దూరం, శానిటైజేషన్, మాస్కు వంటి కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి.