కరోనా దెబ్బ... మా ఉద్యోగులకేదీ సాయం: ప్రభుత్వంపై తిరగబడ్డ వ్యాపారులు!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కంపెనీలు, ఉద్యోగులు, వ్యాపారాలు చేతిలో డబ్బులు లేక కష్టాలు పడుతున్నారు. ఆర్థికవ్యవస్థలు మరింతగా క్షీణించకుండా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సాధ్యమైనంత మేరకు కృషి చేస్తున్నాయి. ఇజ్రాయెల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు! కరోనా ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం సహకారం, నిర్వహణ సరిగ్గా లేదని వేలాదిమంది రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఇకముందు మరింత గండం!
ప్రభుత్వం హ్యాండిల్ చేయలేక మాకు ఇబ్బందులు
కరోనా కారణంగా ఇజ్రాయెల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి, అలాగే ప్రజలకు సరైన విధంగా సహకారం లేదంటూ తేజ్ అవివ్లో వేలాదిమంది నిరసనలు తెలిపారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాబిన్ స్క్వేర్లో పెద్ద ఎత్తున యువకులు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. అయితే సోషల్ డిస్టెన్స్ మాత్రం పాటించలేదు.
చిన్న వ్యాపారుల నుండి స్వయంఉపాధి వర్కర్ల వరకు
ప్రభుత్వం పరిహార చెల్లింపులు చాలా చాలా నెమ్మదించాయని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో యువకులతో పాటు చిన్న చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వర్కర్లు తదితరులు కూడా పాల్గొన్నారు. చాలామంది ఆర్థికంగా చితికిపోయారని, జీవనోపాదిని దెబ్బతీసిన కరోనా పట్ల ఆగ్రహంగా ఉన్నారని, దీనికి తోడు ప్రభుత్వం నుండి తమకు పథకాల రూపంలో అందాల్సిన సహకారం రావడం లేదని విమర్శించారు.
మా ఉద్యోగులకేదీ సాయం
వేతనజీవులకు నిరుద్యోగ భృతి ద్వారా సాయం అందుతోదని, కానీ వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందుతున్న తమలో చాలామంది ప్రభుత్వ సహకారం లేక నెలల కొద్ది వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఓ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. తన వద్ద 40 మంది వర్కర్లు పని చేస్తున్నారని, తమకు ఆదాయం లేక ఉద్యోగులకు వేతనం ఇవ్వలేకపోతున్నామని, దీంతో తమ కార్మికులు, తాము ఇబ్బంది పడుతున్నామన్నారు. తాము కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని, మార్చి నుండి జూలై వరకు కంపెనీ నడవలేదని, ఆగస్ట్లోని పరిస్థితి మారుతున్నట్లుగా కనిపించడం లేదని, కాబట్టి ప్రభుత్వం సహకారం అవసరమన్నారు.
ప్రధాని హామీ
ప్రధాని నెతాన్యాహు నిరసనకారులతో చర్చించి, సాయం వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిడ్యువల్స్కు 2,150 డాలర్లు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. వచ్చే వారంలో ఫండ్ ట్రాన్సుఫర్ చేస్తామన్నారు.
ఇజ్రాయెల్లో 37,464 కరోనా కేసులు నమోదయ్యాయి. 350 మందికి పైగా మృత్యువాత పడ్డారు. జనాభా కనీసం కోటి కూడా లేదు. 90 లక్షలకు పైగా ఉంది. సగటున ప్రతి 10 లక్షల మందిలో 4,073 మందికి కరోనా సోకగా, 38 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రతి పది లక్షలకు 132,799 టెస్టులు నిర్వహించారు.