Crypto Bill: క్రిప్టోను బ్యాన్ చేస్తారా, బిల్లులో ఏముంటుంది? ఆందోళన ఇదే.. పాకిస్తాన్ కంటే ఎక్కువ
ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ ముందు నిలిచింది. భారత కరెన్సీ రూపాయితో మార్పిడి చేసే పరిమితిని బలహీనపరిచినప్పటికీ, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అత్యంత వేగంగా వృద్ది సాధిస్తోన్న దేశాల్లో భారత్ మార్కెట్ ముందు నిలిచింది. అధికారిక డిజిటల్ కరెన్సీ రావాలని భావిస్తోన్న భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రయివేటు క్రిప్టో కరెన్సీలని నిషేధించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం నిషేధించడం కాకుండా, నియంత్రణ వైపు చూస్తోందని తెలుస్తోంది. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మినహాయింపుకు సిద్ధంగా కనిపిస్తోంది.
భారత్లో క్రిప్టో
భారత్లో క్రిప్టో మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. క్రిప్టో అనాలసిస్ కంపెనీ చైనాలసిస్ అక్టోబర్ నివేదిక ప్రకారం.. 2020 జూలై నెల నుండి 2021 జూన్ వరకు అంటే ఈ ఏడాది కాలంలో బారత్లో క్రిప్టో వృద్ధి ఏకంగా 641 శాతం ఉంది. అలాగే, సెంట్రల్, సదర్న్ ఏసియాలో నాలుగో అతిపెద్ద క్రిప్టో మార్కెట్ను కలిగి ఉంది. ఆ ఏడాది కాలంలో 572.5 బిలియన్ డాలర్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
గ్లోబల్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూలో ఇది 14 శాతం. గత ఏడాది జూలై నుండి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్లో 10 మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ వ్యాల్యూ కలిగిన వాటా 42 శాతం. అదే సమయంలో పాకిస్తాన్లో ఈ వాటా 28 శాతం, వియత్నాంలో 29 శాతంగా ఉంది. ఇది మరింత మెచ్యూర్డ్ ఇండియన్ మార్కెట్కు నిదర్శనంగా చెబుతున్నారు. భారత్లో యంగ్ అండ్ టెక్ అవగాహన కలిగిన ఎక్కువగా ఉండి, రిటైల్ ఇన్వెస్టర్ల వృద్దిలో వియత్నాం తర్వాత రెండో స్థానంలో ఉంది.
క్రిప్టో వృద్ధి.. ఆందోళన.. బిల్లు
2018లో భారత్ క్రిప్టోను నిషేధించింది. అయితే 2020 మార్చి నెలలో సుప్రీం కోర్టు ఈ నిషేధానికి ముగింపు పలికింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే క్రిప్టోపై ఆందోళనలు నెలకొన్నాయి. ఎలాంటి నియంత్రణ, నియమనిబంధనలు లేకపోవడం పట్ల ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు..చేస్తున్నారు. ఈ క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడుల వైపు హౌస్ హోల్డ్స్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో కఠిన నిబంధనలు రావాలనే డిమాండ్స్ వినిపించాయి. లేదంటే క్రిప్టో ఇన్వెస్టర్లు ఆర్థికంగా ఇబ్బంది పడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో నియంత్రణకు భారత్ శీతాకాల సమావేశాల్లో బిల్లును తీసుకు వస్తుందనే వార్తల నేపథ్యంలో గత వారం రోజులుగా బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు పతనమయ్యాయి.
భారత్ ఆందోళన ఏమిటి
భారత స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో పెనుముప్పుగా భావిస్తోంది ఆర్బీఐ. రూపాయి పార్శల్ కన్వర్టబుల్ అవుతుంది. రూపాయి అధికారిక కరెన్సీ. కానీ క్రిప్టో అలా కాదు. గ్రే మార్కెట్లో స్వేచ్చగా ట్రేడ్ చేయవచ్చు. ఎలాంటి రెగ్యులేటర్ లేదు. అనామక కరెన్సీగా ఉంది. ట్రాన్సాక్షన్స్ పైన పన్ను విధించే అవకాశం లేదు. మనీలాండరింగ్, టెర్రరిం ఫైనాన్సింగ్ సమస్యలపై ఆందోళనలు నెలకొన్నాయి.
బిల్లులో ఏం ఉండవచ్చు
దేశంలోని అన్ని క్రిప్టోలను నిషేధించాలని ఆర్బీఐ కోరుతోంది. అయితే క్రిప్టో అంతర్లీన సాంకేతికతను, దాని ఉపయోగాలని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. క్రిప్టోను ఆర్థిక ఆస్తిగా పరిగణించవచ్చునని, అయితే పెట్టుబడి కోసం కనీస మొత్తాన్ని నిర్దేశించవచ్చునని తెలుస్తోంది. నియంత్రణ, పన్ను ఉండవచ్చునని తెలుస్తోంది.
సొంత క్రిప్టో
ఈ సంవత్సరం బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే డిసెంబర్ 23వతేదీ లోపు డ్రాఫ్ట్ను ఖరారు చేసి క్యాబినెట్ ద్వారా క్లియర్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల కేంద్ర బ్యాంకులు చేస్తున్నట్లుగా, అలాగే చైనా సొంత డిజిటల్ కరెన్సీ దిశగా వెళ్తున్న విధంగా ఆర్బీఐ కూడా తన డిజిటల్ కరెన్సీ తీసుకు వస్తే సహకరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ దశలవారీగా ఉండవచ్చు.
మోడీ డిజిటల్ అడుగులు
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభం నుండి డిజిటల్ దిశగా అడుగులు వేస్తోంది. అవినీతిని తగ్గించడం కోసం, నకిలీ కరెన్సీకి ఊతమివ్వకుండా ఉండేందుకు, బ్లాక్ మనీకి చెక్ చెప్పే విధంగా 2016లో మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారీ ప్రకటన చేశారు. ఇది డిజిటల్ ఇండియా వేగవం.తమయ్యేందుకు దోహదపడింది. డిజిటలైజేషన్ కోసం ఎన్నో కీలక బిల్లులను తీసుకు వచ్చింది. దీంతో పేటీఎం వంటి సంస్థ అగ్రగామిగా తెరపైకి రావడానికి ఉపకరించింది. మెకెన్సీ నివేదిక ప్రకారం 2010లో 100 శాతం ఫియట్ కరెన్సీ చెల్లింపు ఉంటే 2020 నాటికి 89 శాతంగా ఉంది. గత రెండేళ్లలో డిజిటల్ చెల్లింపులు ఐదు రెట్లు పెరిగాయి.