Viral News: ఏడాదికి రూ.కోటి జీతం.. కానీ బోర్ కొడుతోందంటూ యజమానిపైనే కేస్.. సీన్ కట్ చేస్తే..
Viral News: ఏడాదికి కోటి రూపాయలు జీతం పొందటం అంత సులువు కాదని మనందరికీ తెలుసు. అలా అని జీతం తీసుకుంటూ చివరికి కంపెనీ యజమాన్యం పైనే కోర్టుకెక్కటం వింటానికి విడ్డూరంగానే ఉందికదా. కానీ ఇది నిజంగానే జరిగింది బాసు. మనలాంటి వారు ఈ కారణాలకు కూడా కేసులు పెట్టుకుంటారా అని నోరెళ్లబెట్టుకునే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.కోటి జీతం..
చేసే పని ఏదైనా ఆదాయం ఉంటే చాలు, సమయానికి చేతికి జీతం అందుతుంటే అది ఎలా ఉంటుంది. ఇది సగటు భారతీయ యువకుడి కల. చేయటానికి పెద్దగా పనిలేకుండా హాయిగా ఇంత భారీ ప్యాకేజీని ఏడాదికి అందుకోమనగానే టక్కున క్యూలు కట్టేస్తాం మనం. కానీ వీటన్నింటికీ విరుద్ధంగా ఉన్న ఒక ఉద్యోగి ఏకంగా కంపెనీపై కేసు పెట్టిన విషయం సంచలనం కావటంతో పాటు ఇంటర్నెట్ లో ప్రస్తుతం వైరల్ గా కూడా మారిపోయింది.
చేయాల్సిన పని ఏమిటి..
ఒక ఐరిష్ వ్యక్తికి ఏడాదికి రూ.1.03 కోట్లు జీతంగా తన కంపెనీ నుంచి పొందుతున్నాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. తనకు చేయటానికి పని ఏమీ లేదంటూ సదరు ఉద్యోగి కంపెనీపై కేసు పెట్టాడు. ఐర్లాండ్లోని డబ్లిన్కు చెందిన డెర్మోట్ అలస్టైర్ మిల్స్ అనే వ్యక్తి ఇలా కోర్టులో దావా వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. తన ఉద్యోగ సమయంలో పని లేకపోవటం వల్ల అతడు ఎక్కువ సమయం వార్తాపత్రికలు చదవడం, శాండ్విచ్లు తినడం, వాకింగ్ చేయడం వంటి వాటిపైనే సమయాన్ని గడుపాల్సి వస్తోందని డైలీ మెయిల్ వార్తా సంస్థ నివేదించింది.
ఉద్యోగి మాట..
"నేను నా క్యూబికల్లోకి వెళ్తాను. నేను నా కంప్యూటర్ను ఆన్ చేసి ఈ-మెయిల్లను చూస్తాను. పనికి సంబంధించిన ఈ-మెయిల్స్ లేవు, మెసేజ్ లు లేవు, కమ్యూనికేషన్లు లేవు, సహోద్యోగి కమ్యూనికేషన్లు లేవు" అని మిల్స్ తెలిపారు. పైగా అతడు తన 5 పనిదినాల్లో కేవలం రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లేవాడు. పనేమీ లేకపోవటంతో త్వరగా ఇంటికి తిరిగి వచ్చేసేవాడినని తెలిపాడు.
అక్రమాలపై నోరు విప్పినందుకు..
కంపెనీపై దావా వేయడానికి ముందు 2010లో సదరు ఉద్యోగి పనిలో ప్రమోషన్ పొందాడు. కానీ దురదృష్టవశాత్తు వేధింపులకు గురై 3 నెలలు సిక్ లీవ్ పెట్టాడు. కంపెనీలోని అకౌంట్లలో జరుగుతున్న అక్రమాలపై నోరు విప్పటంతో పరిస్థితులు దిగజారాయి. సిక్ లీవ్ తర్వాత అదే జీతం, హోదాతో తిరిగి తీసుకుంటామని కంపెనీ తెలిపింది. కానీ ఆ తర్వాత ఎలాంటి పని లేకుండా జీతం తీసుకోవటంతో తన నైపుణ్యాలను ఉపయోగపకుండా అడ్డుకుంటున్నట్లు వర్క్ప్లేస్ రిలేషన్స్ కమిషన్లో విచారణలో చెప్పాడు.