2022 మార్చి వరకు కరోనా పాలసీలు, బీమా సంస్థలకు ఆర్డీఏఐ అనుమతి
కరోనా చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య పాలసీలు కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలను వచ్చే ఏడాది(2022) మార్చి నెల 31వ తేదీ వరకు పునరుద్ధరించేందుకు, విక్రయించేందుకు బీమా సంస్థలకు నియంత్రణ సంస్థ IRDAI అనుమతి ఇచ్చింది. కరోనా కవచ్ సాధారణ ఆరోగ్య బీమా పాలసీలను పోలి ఉంటుంది. దీనిని సాధారణ బీమా సంస్థలతో పాటు, స్టాండలోన్ ఆరోగ్య బీమా సంస్థలు అందిస్తాయి. కరోనా రక్షక్ పాలసీదారులకు కరోనా పాజిటివ్గా తేలితే పాలసీ వ్యాల్యూ మొత్తం పరిహారంగా లభిస్తుంది. మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల వ్యవధికి ఈ పాలసీలను తీసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వీటిని అందించేందుకు గత మార్చి నెలలో IRDAI ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు వీటి జారీని 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్
కాగా, కరోనా పేషెంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కవచ్ పర్సనల్ లోన్ స్కీంను ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. వడ్డీ రేటు కూడా కేవలం 8.5 శాతానికి మంజూరు చేస్తోంది. ఎలాంటి తనఖా కూడా అవసరం లేదు. వ్యక్తిగత రుణ విభాగంలో ఇప్పటి వరకు ఇదే కనిష్ట వడ్డీ రేటు అని బ్యాంకు చెబుతోంది.
60 నెలల కాలపరిమితితో కూడిన ఈ రుణంపై మూడు నెలల వరకు మారటోరియం ఆఫర్ చేసింది. వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యులు కరోనా చికిత్స అవసరాల కోసం ఈ రుణాన్ని పొందవచ్చును. ఈ రుణ పథకంలో ఇప్పటికే వెచ్చించిన కరోనా వైద్య ఖర్చులకు రీయింబర్సుమెంట్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది ఎస్బీఐ. కరోనా బారిన పడుతున్న వారికి ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వేతనజీవులు కాని వారికి కూడా ఈ రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.