కరోనా పాలసీల గడువు మరోసారి పెంపు, సెప్టెంబర్ 30 వరకు అవకాశం
ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Irdai) షార్ట్ టర్మ్ కోవిడ్ ఇన్సురెన్స్ స్పెసిఫిక్ ఉత్పత్తుల గడువును మరికొంత కాలం పొడిగించింది. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య పాలసీలు కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీల గడువు తేదీని పొడిగిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించింది. జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలతో పాటు మిగతా ఆరోగ్య బీమా సంస్థలు సెప్టెంబర్ 30, 2022 వరకు ఈ పాలసీలను పునరుద్ధరించేందుకు, విక్రయించేందుకు Irdai అనుమతి ఇచ్చింది.
కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా అందించే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను తొలుత జూన్ 2020 నుండి మార్చి 31, 2021 వరకు అందించారు. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నేపథ్యంలో పాలసీ గడువును పొడిగిస్తూ వచ్చారు. ఈ పాలసీ విక్రయ, పునరుద్ధరణ గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువును మరోసారి పొడిగించారు. దీనిని సెప్టెంబర్ 30, 2022 వరకు పొడిగించారు.
కరోనా కవచ్ అంటే కోవిడ్ 19 బారిన పడినవారికి ఈ పాలసీ పరిమితి వరకు వాస్తవ ఖర్చులను చెల్లిస్తుంది. పాలసీ కనీసం రూ.50వేలు, గరిష్టంగా రూ.5 లక్షల బీమా మొత్తాన్ని అందిస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబం కోసం ఫ్లోటర్ ప్లాన్గా ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రిలో ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది.
కరోనా రక్షక్ స్టాండర్డ్ బెనిఫిట్ బేస్ట్ ఆరోగ్య బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తికి కరోనా నిర్ధారణ అయితే హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. రూ.50వేల నుండి రూ.2.50 లక్షల వరకు అందిస్తారు. వ్యక్తిగతంగా మాత్రమే ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఆసుపత్రిలో చేరి కనీసం 72 గంటల పాటు చికిత్స పొందితే పాలసీ వర్తిస్తుంది.