పడిపోయిన ఐఆర్సీటీసీ షేర్లు... 20 శాతం వాటా విక్రయించనున్న కేంద్రం...
ఐఆర్సీటీసీ షేర్లు గురువారం(డిసెంబర్ 11) 13శాతం మేర పడిపోయి ఒకరోజు కనిష్టానికి రూ.1405కి చేరాయి. ఐఆర్సీటీసీలో కేంద్రం 20శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించడంతో షేర్ల ధర పడిపోయింది.
'నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు శుక్రవారం నుంచి ఆఫర్ ఆఫర్ సేల్ అవకాశం అందుబాటులోకి వస్తుంది. రెండో రోజు,అంటే శనివారం రిటైల్ ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది. 5శాతం గ్రీన్ షూ ఆప్షన్తో ప్రభుత్వం 15శాతం ఈక్విటీని ఉపసంహరించుకోనుంది.' అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(DIPAM) సెక్రటరీ తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 3.2కోట్ల షేర్లను విక్రయించనుంది.తద్వారా రూ.4374 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వ ఖజానా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం మొత్తం 2.10లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.
ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) రైల్వేలో కేటరింగ్ సేవలతో పాటు ఆన్లైన్ రైల్వే టికెట్లు,ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తదితర సేవలను అందిస్తోంది. 2019లో ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఆ సమయంలో ఐపీవో ద్వారా రూ.645కోట్లు సమకూర్చుకుంది.
ప్రస్తుతం ఐఆర్సీటీసీ షేర్ ధర పడిపోవడంతో ఇన్వెస్టర్లు వాటిని కొనుగోలు చేసుకునేందుకు మంచి అవకాశం లభించిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.