ఐపీఎల్ 2020 స్పాన్సర్ టైటిల్ డ్రీమ్11లోనూ చైనా పెట్టుబడులు!: గంగూలీకి లేఖ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 టైటిట్ స్పాన్సర్ షిప్ విషయంలో అంత ముగిసిందనుకుంటే. మరో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీ వీవో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఫాంటసీ క్రీడల నిర్వహణ సంస్థ 'డ్రీమ్11' స్పాన్సర్ గా వచ్చిన విషయం తెలిసిందే.
డ్రీమ్ 11లో చైనా పెట్టుబడులు...
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ టైటిట్ స్పానరర్గా బీసీసీఐ ‘డ్రీమ్11'ను ఎంచుకోవడాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) వ్యతిరేకించింది. డ్రీమ్11లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాసింది. 2020 ఐపీఎల్ టైటిట్ స్పాన్సర్షిప్ను డ్రీమ్11కు అప్పగించడంతో తీవ్ర కలత చెందినట్లు పేర్కొంది. ఎందుకంటే, ఆ సంస్థలో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయని తెలిపింది.
టెన్సెంట్ గ్లోబల్ కీలక వాటాదారు..
చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ అనే సంస్థ డ్రీమ్11లో కీలక వాటాదారు అని పేర్కొంది. డ్రీమ్11కు స్పాన్సర్ షిప్ను కట్టబెట్టడంపై చైనా వస్తువులను బహిష్కరిస్తున్న భారతీయుల మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేసింది. చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారానికి సీఏఐటీ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
డ్రీమ్ 11కు కలిసొచ్చిన అవకాశం..
భారతదేశంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంగా కొనసాగున్న క్రమంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ వీవో తప్పుకుంది. దీంతో సెప్టెంబర్ నుంచి దుబాయ్లో నిర్వహించే ఐపీఎల్ 13వ సీజన్ కోసం బీసీసీఐ కొత్త సంస్థలను స్పాన్సర్ షిప్ కోసం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ కంపెనీలైన టాటా, బైజూస్, పతంజలి లాంటి సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, చివరకు డ్రీమ్ 11 రూ. 222 కోట్లకు టైటిల్ స్పానర్స్ హక్కులను దక్కించుకుంది. కాగా, వీవో 430 కోట్ల రూపాయలకుపైగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం వెచ్చిస్తే.. ఇప్పుడు అందులో సగం మొత్తంతోనే డ్రీమ్11 ఆ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం.