అక్టోబర్ నుండి ట్రేడింగ్-డీమ్యాట్, నామినేషన్ సదుపాయం
అక్టోబర్ నుండి కొత్త ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు నామినేషన్ వివరాలు ఇవ్వడం/ఇవ్వకపోవడం అనే వెసులుబాటును ఇవ్వనున్నట్లు సెబి వెల్లడించింది. నామినేషన్కు నామినేషన్ పత్రం, నిలిపివేసేందుకు డిక్లరేషన్ పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటికే ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉనన అర్హులైనవారు 2022 మార్చి 31వ తేదీలోపు నామినేషన్ ఎంపిక వివరాలు సమర్పించాలని, లేదంటే ఆయా ఖాతాలు స్తంబింప చేస్తామని తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం ధృవీకరణ పత్రాలు అందిన తర్వాత ట్రేడింగ్ మెంబర్స్, డిపాజిటరీ పార్టిసిపెంట్లు 2021 అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను యాక్టివేట్ చేయాలని సెబి తెలిపింది. నామినేషన్, డిక్లరేషన్ పత్రాలపై ఖాతాదారు సంతకం ఉండాలని, సాక్షి అవసరం లేదని వెల్లడించింది.
ఒకవేళ ఖాతాదారు సంతకానికి బదులు వేలిముద్ర వేస్తే సాక్షి సంతకం ఉండాలని తెలిపింది. ఆన్లైన్ నామినేషన్, డిక్లరేషన్ ఫామ్స్ పైన కూడా ఈ-సిగ్నేచర్ సదుపాయంతో సంతకం చేయాలని, సాక్షి సంతకం అవసరం లేదని తెలిపింది.
ఈ-సిగ్నేచర్తో ఆన్లైన్లోనూ నామినేషన్, డిక్లరేషన్ ఫామ్స్ సమర్పించవచ్చు. ఇందుకు సాక్షుల సంతకం అవసరంలేదు. ఇప్పటికే ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉన్న ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. లేదంటే వారి ఖాతాలు స్తంభింపచేస్తారు.