ఎయిరిండియా ప్రయివేటీకరణ, తప్పుకున్న ఇంటరప్స్: వారంలో బిడ్డర్స్ పేరు
ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. వాటిని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపమ్) జనవరి 5-6 తేదీలలో పరిశీలించి, అర్హులను ప్రకటిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఎయిరిండియా ఆర్థిక వివరాలు వారికి అందించి, పరిశీలనకు 90 రోజుల గడువు ఇస్తామని, ఆ తర్వాత ఆర్థిక బిడ్స్ దాఖలు చేయాలని కోరుతామని, ప్రక్రియ అంతా పారదర్శకంగా, పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు.
జనవరి 1 నుండి ఓకే...: తగ్గుతోన్న ఉల్లి ధరలు, కేంద్రం కీలక ప్రకటన
విమానాశ్రయ ప్రయివేటీకరణ
కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నడుస్తున్న విమానాల్లో ఛార్జీలకు విధించిన పరిమితులు వచ్చే ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని కేంద్రమంత్రి తెలిపారు. భాగస్వాములతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. 2018 నవంబర్ నెల్లో 6 విమానాశ్రయాల ప్రయివేటీకరణకు బిడ్స్ పిలవగా, మంగళూరు, లక్నో, అహ్మదాబాద్లను ప్రయివేటు సంస్థలకు అప్పగించింది. కోర్టు కేసు కారణంగా ఆలస్యమైన తిరువనంతపురం విమానాశ్రయంతో పాటు గౌహతి, జైపూర్ విమానాశ్రయాలను కూడా అదానీ ప్రయివేటు సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ఇంటరప్స్ ఉపసంహరణ
అమెరికా కేంద్రంగా పని చేసే ఫండ్ సంస్థ ఇంటరప్స్, ఎయిరిండియా రేసు నుండి వెనుకడుగు వేసింది. ఎయిరిండియా కొనుగోలుకు ఆ సంస్థ ఉద్యోగులతో కలిసి బిడ్ వేయాలనేది ఇంటరప్స్ ప్రతిపాదన. అయితే చేతులు కలిపేందుకు ఉద్యోగులు నిరాకరించడంతో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను ఇంటరప్స్ ఉపసంహరించుకుంది.
టాటాల చేతికి ఎయిరేషియా
ఇదిలా ఉండగా, ఎయిరేషియా ఇండియాను టాటా సన్స్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఎయిరేషియాలో ప్రస్తుతం టాటా గ్రూప్కు 51 శాతం వాటా ఉంది. తాజాగా 32.67 శాతం వాటాను కొనుగోలు చేసింది. ట్రాన్సాక్షన్ అనంతరం 83.67 శాతం దక్కించుకుంది. ఇక, ఎయిరేషియా ఇన్వెస్ట్మెంట్స్ ముంబై వాటా 16.33 శాతంగా ఉంది. తాజా ట్రాన్సాక్షన్ వ్యాల్యూ రూ.280 కోట్లు. ట్రాన్సాక్షన్ ముగిసిన తర్వాత ఎయిరేషియాకు మిగిలిన 16.33 శాతం వాటాను కూడా టాటా సన్స్ దక్కించుకోవచ్చు. అదనంగా రెండు దఫాల్లో ఫుట్ ఆప్షన్స్ సైతం ఎయిరేషియా వినియోగించుకోవచ్చు.