ఈ ఇన్సురెన్స్తో నష్టాలు... కాదు లాభమే: కంపెనీలు ఔట్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను ప్రవేశపెట్టి రైతులకు, వ్యవసాయానికి కొత్త ఊపిరులూదింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గత జాతీయ వ్యవసాయ బీమా పథకం (NAIS) కంటే మెరుగైన ప్రయోజనాన్ని అందిస్తోంది. PMFBY టైమ్ బాండ్ గోల్స్ వాణిజ్య సూత్రాలతో తీసుకు వచ్చిన పథకం. ఈ పథకం బీమా కంపెనీలకు ఇబ్బందికరంగా మారిందట. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పరిహారం కోరుతూ భారీ క్లెయిమ్స్ వస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాల కారణంగా కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయని చెబుతున్నారు. నష్ట శాతం, క్లెయిమ్ సబ్సిడీల విషయంలో NAISకి పూర్తి విరుద్ధంగా PMFBY ఉందని భావిస్తున్నారట.
ఆదాయపు పన్ను స్లాబ్స్, సేవింగ్లో కీలక మార్పులు!
PMFBY ద్వారా రైతులకు ప్రయోజనం
సేల్స్, పంపిణీలో PMFBY ఒక నమూనా మార్పును తీసుకు వచ్చింది. మోసపూరిత ఎన్రోల్మెంట్స్ను నివారించేందుకు కఠినమైన తనిఖీలు, బ్యాలెన్స్ను అమలు చేసింది. ఆధార్, భూరికార్డుల ద్వారా రైతుల ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది. సబ్సిడీలు రైతుల నిజమైన అవసరాలకు అందేలా ఈ పథకం రూపొందించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కామన్ సర్వీస్ సెంటర్లను గ్రామాల్లోకి కూడా విస్తరించింది. ఆన్ లైన్ పోర్టల్స్ రైతులు, బ్యాంకులు, బీమా సంస్థలను కలుపుతున్నాయి.
ఆశ.. నిరాశ
ఐతే పంటల బీమా అంటే కొన్ని ఇన్సురెన్స్ కంపెనీలు కాస్త జంకుతున్నాయట. ప్రకృతి విపత్తుల కారణంగా భారీగా క్లెయిమ్స్ వస్తుండటంతో నష్టాల నేపథ్యంలో పునరాలోచనలో పడుతున్నాయట. రీ-ఇన్సురెన్స్ ఛార్జీలు కూడా అధికంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు ఇన్సురెన్స్ కంపెనీలు ఈ విభాగం నుంచి తప్పుకున్నట్లుగా డేటా తెలియజేస్తోందని అంటున్నారు. అయతే మరికొన్ని కంపెనీలు మాత్రం ఆశావహంగా ఉన్నాయట.
పరిహారం ఎక్కువ..
PMFBY కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో వసూలు అయిన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్స్ రూ.రూ.27,550 కోట్లు కావడం గమనార్హం. ప్రభుత్వరంగంలోని రీ-ఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకుంది.
పెరిగిన స్థూల ప్రీమియం
క్రాప్ ఇన్సురెన్స్ విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కాలంలో పెరిగింది. అంతక్రితం ఏడాది వచ్చిన మొత్తంతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి కనిపించింది. క్రాప్ ఇన్సురెన్స్ మంచి పనితీరును కనబరుస్తోందని, కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉందని, అయినప్పటికీ చాలా ఇన్సురెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్గా ఉన్నాయని చెబుతున్నారు.