కరోనా ట్రీట్మెంట్ బిల్లులు భారీగా పెంచేస్తున్నారు... ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆరోపణ!
కరోనా వైరస్ కు ఒక ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ లేదు. కానీ దాని బారిన పడిన వారికి ఐసిఎంఆర్ మార్గనిర్దేశకాల ప్రకారం చికిత్స అందిస్తున్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూ హెచ్ ఓ) గైడ్లైన్స్ కూడా పాటిస్తున్నారు. సాధారణ జ్వరం వస్తే తగ్గించే పారాసెటమాల్ మాత్రలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు విటమిన్ సి, శరీరం అలసి పోకుండా ఉండేందుకు విటమిన్ డి, జింక్ సహా రక రకాల శక్తినిచ్చే మందులను ఇస్తున్నారు.
వాటితో పాటు ఇటీవల అంటి వైరల్ డ్రగ్స్ రెండేసివిర్, ఫావిపిరావిర్ వంటి ఔషధాలను కూడా అందిస్తున్నారు. కరోనా బారిన పడిన 90 శాతం మంది రోగులు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ... డాక్టర్ సూచించిన మందులను వాడితే దాదాపు హోమ్ ఐసొలేషన్ లోనే కోలుకుంటున్నారు. కానీ మిగితా వారికి ఆక్సిజన్ అందించటం, వెంటిలేటర్ తో చికిత్స చేయాల్సి వస్తోంది. అదే సమయంలో షుగర్, బీపీ, ఆస్తమా వంటి రుగ్మతలు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న వారికి మాత్రం ఆస్ప్రతుల్లో చికిత్స అందించాల్సి వస్తోంది.
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స అందిస్తుండగా... ఇటీవల ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా అనుమతి మంజూరు చేయటంతో ప్రజలు అధికంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. కానీ అక్కడే పెద్ద సమస్య ఎదురవుతోంది.
చైనీస్ టిక్టాక్కు మరింత ఊరటనిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
అడ్డగోలు బిల్లులు...
ముందే చెప్పుకున్నట్లు కరోనా వైరస్ కు ఒక ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. కానీ, కరోనా వైరస్ లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లిన వారికి అవి ఇస్తున్న బిల్లులతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. రోజుకు సుమారు రూ లక్ష వరకు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇవి కేవలం మీడియా లో వస్తున్న కథనాలు మాత్రమే కాదు.
స్వయంగా ఇదే మాటను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల సంఘం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అంటుండటం విశేషం. కరోనా వైరస్ చికిత్స లో ప్రైవేటు హాస్పిటల్స్ విపరీతంగా బిల్లులు పెంచి చూపిస్తున్నాయని ఈ కౌన్సిల్ ఆరోపణ చేస్తోంది. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్లులపై నియంత్రణ ఉండాలని కోరుతోంది.
సుప్రీమ్ కు చేరనున్న పంచాయతీ...
సాధారణంగా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు, చికిత్సకు చెల్లించాల్సిన మొత్తం ఇన్సూరెన్స్ రేగులటరీ అథారిటీ (ఐ ఆర్ డీ ఏ ) నిర్ణయిస్తుంది. దానికి మించి పరిహారం చెల్లించే అధికారం బీమా కంపెనీలకు ఉండదు. కానీ, ప్రస్తతం మెడికల్ బిల్లులు కృత్రిమంగా పెరుగుతున్నాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ హెడ్ ఎస్ ఎన్ శర్మ టైమ్స్ ఆఫ్ ఇండియా కు వెల్లడించారు. దీనిపై పోరాటం చేసేందుకు కూడా కౌన్సిల్ సిద్ధంగా ఉంది.
కోవిడ్ చికిత్స ధరలపై కోల్కతా కు చెందిన ఒక వ్యక్తి సుప్రీమ్ కోర్ట్ లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీ ఐ ఎల్ ) దాఖలు చేశారు. అదే వ్యాజ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అవుదామని కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కౌన్సిల్ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. ఒక వేళ సుప్రీమ్ కోర్ట్ దానికి సమ్మతిస్తే దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలకు అడ్డుకుకట్ట పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రూ లక్షల్లో బిల్లులు...
ఎక్కడో ఎందుకు మన హైదరాబాద్ లోనే కొన్ని వందల కొద్దీ ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయని, రూ లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొన్ని హాస్పిటల్స్ పై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా సరే వాటి ఆగడాలు తగ్గటం లేదు. ఇటీవల ఒక రోగికి కేవలం పీపీఈ కిట్ ల కోసమే రూ 96,000 బిల్లు వేయటం గమనార్హం.
చాలా మంది రోగులు రూ 10 లక్షలు, రూ 20 లక్షలు బిల్లులు చెల్లించామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా ఆ సౌకర్యాన్ని అనుమతించటం లేదని, కేవలం నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న కొందరికి అందులోని మొత్తం అమౌంట్ తీసేసుకుని, పైగా మరో రూ 2 లక్షల నుంచి రూ 3 లక్షల వరకు అదనంగా బాదుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ రంగంలోకి దిగటం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు.