ఆటో కంపెనీలు విలవిల... బీమా కంపెనీలు కళకళ.. ఎందుకో తెలుసా?
దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితుల నేపథ్యంలో అన్నిరకాల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్త వాహనాలు కొనే వారి కోసం కంపెనీలు గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాయి. అనేక రకాల డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాకులు ఇచ్చి కస్టమర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి కంపెనీలు. కార్లు, ద్విచక్రవాహనాలు కొనే వారి కోసం ఫైనాన్స్ సదుపాయాన్ని అందుబాటులోనే ఉంచుతున్నాయి. అయినప్పటికీ వాహనాల కొనుగోళ్ల విషయంలో కస్టమర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీని వల్ల కంపెనీలు విలవిల్లాడే పరిస్థితి నెలకొంటోంది.
1, 2, 3 ఇలా నెలలు గడిచినా పరిస్థితి మాత్రం మారడం లేదు. కార్ల అమ్మకాలు తగ్గడం వల్ల ఈ రంగంపై ఆధార పడిన అనుబంధ రంగాలన్నీ దెబ్బతింటున్నాయి. అయితే ఈ రంగమే కీలకంగా ఉన్న ఇన్సూరెన్సు రంగంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. వాహనం కొనుగోలు చేయగానే దానికి బీమా తీసుకోవడం తప్పనిసరి. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల బీమా పాలసీల విక్రయాలు కూడా తగ్గుతాయి. కొన్ని నెలలపాటు ఇదే పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
సద్దుమణిగిన 'రింగింగ్ టైమ్' వివాదం! ట్రాయ్ ఏం చెప్పిందంటే...
ఎందుకంటే..
* మోటార్ ఇన్సూరెన్సు పాలసీల అమ్మకాలు ఈ మధ్య కాలంలో జోరుగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఇటీవలి కాలంలోనే నుంచి అమల్లోకి వచ్చిన మోటార్ వాహనాల చట్టమే.
* ఈ చట్టం ప్రకారం బీమా లేకపోతే భారీ స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అందరు బీమా తీసుకుంటున్నారు.
* కాబట్టి కొత్త వాహనాలకు సంబంధించిన బీమా పాలసీలు తగ్గినప్పటికీ పాత వాహనాల బీమా లు పెరిగిపోవడం వల్ల బీమా కంపెనీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగిపోతోంది.
భారీగా పెరిగిన ప్రీమియం ఆదాయం..
* భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం 20,145.46 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం ఆదాయం కేవలం 14,463 కోట్లు మాత్రమే ఉంది. ఆదాయంలో 16.84 శాతం వృద్ధి నమోదయింది.
* మోటార్ ఇన్సూరెన్సు పాలసీల విక్రయం ద్వారానే ఈ కంపెనీలకు ఎక్కువ రాబడి వచ్చింది.
* ఇదే సెప్టెంబర్ నెలలో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు 24 శాతం తగ్గాయి.
* బీమా లేకపోవడం వల్ల జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది కాబట్టి చాలా మంది బీమాను తీసుకుంటున్నారు. ముఖ్యంగా థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజ్ పాలసీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
వచ్చే ఏడాది తగ్గవచ్చు...
* ప్రస్తుతం మూడేళ్లు ఐదేళ్ల కాలానికి కూడా బీమాను ఒకేసారి తీసుకునే సదుపాయం ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి వాటిని ఎంచుకుంటున్నారు. అయితే ఈసారి చాలా మంది బీమాను తీసుకున్నారు కాబట్టి వచ్చే ఏడాదిలో ప్రీమియం సంఖ్య తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
* బీమాతీసుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని బీమాను తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.