22వ తేదీ నాటికి 15 లక్షలకు పైగా కరోనా క్లెయిమ్స్ పరిష్కారం
ఇన్సురెన్స్ కంపెనీలు ఈ నెల 22వ తేదీ నాటికి రూ.15,000 కోట్ల విలువ చేసే 15.39 లక్షలకు పైగా కరోనా చికిత్స బీమా క్లెయిమ్స్ను పరిష్కరించాయి. ఆ తేదీ నాటికి దాఖలైన 19.11 లక్షల క్లెయిమ్స్లో ఇది 80 శాతానికి సమానమని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (Irdai) సభ్యులు ఒకరు తెలిపారు. అసోచామ్ అధ్వర్యంలో గురువారం జరిగిన 13వ గ్లోబల్ ఇన్సూరెన్స్ ఈ-సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.
ఇప్పటి వరకు 55,276 కరోనా మరణాల క్లెయిమ్స్ దాఖలు అయ్యాయి. జీవిత బీమా సంస్థలు 88 శాతం (48,484 క్లెయిమ్స్) పరిష్కరించాయని పేర్కొన్నారు. కరోనా డెత్ క్లెయిమ్స్ కింద బీమా కంపెనీలు రూ.3,593 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. తిరస్కరించబడిన హెల్త్ క్లెయిమ్స్ శాతం 4 శాతం కాగా, లైఫ్ ఇన్సురెన్స్ 0.66 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
లైఫ్ అండ్ నాన్ లైఫ్ ఇన్సురర్స్ వృద్ధి ఏప్రిల్, మే నెలలో 7 శాతంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే అయిదేళ్లలో పరిశ్రమ 40 శాతం నుండి 50 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చునని వెల్లడించారు. కానీ క్షీణించే అవకాశం లేదన్నారు.