ఫ్రెషర్స్కు ఇన్ఫోసిస్ గుడ్న్యూస్, కొత్త టెక్నాలజీకి సిద్ధంగా ఉండాలి
2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ 55,000 మందిని, అంతకంటే ఎక్కువమంది కొత్త వారిని చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. 'మరో నెల రెండు నెలల్లో పూర్తికానున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేం 55,000 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్స్ను రిక్రూట్ చేసుకుంటున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంతేమందిని లేదా అంతకంటే ఎక్కువ ఫ్రెషర్స్ను చేర్చుకోవాలని భావిస్తున్నాం. మా విధానం ఎప్పుడూ ఉత్తమ శిక్షణ ప్రదాతలుగా ఉంటుంది' అని సలీల్ పరేఖ్ అన్నారు. ఈ మేరకు నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరమ్ 2022 (NTLF)లో మాట్లాడారు.
కొత్త వారికి మంచి అవకాశం
టెక్ రంగంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దానిని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువ మందిని నియమించుకునే అవకాశముందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కంపెనీలో చేరి, ఎదిగేందుకు కొత్తవారికి ఇది మంచి అవకాశమన్నారు.
కొత్త స్కిల్స్ అవసరం
నైపుణ్యం కలిగిన మానవవనరులపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఫ్రెషర్స్కు ఉద్యోగం కల్పించే ముందు ఆరు నెలల నుండి ఏడాదిపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కూడా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. అయితే టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే కొత్తవారు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. టెక్నాలజీ రంగం ఎప్పటికి అప్పుడు వేగంగా మార్పులకు లోనవుతుందన్నారు. అందుకే మూడు నుండి అయిదేళ్లకోసారి కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు.
వారికి భవిష్యత్తు
తమ సంస్థలో ప్రస్తుత ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు సలీల్ పరేఖ్. తమ క్లయింట్స్ డిజిటల్ పరివర్తన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఆ దిశగా వెండర్లు, క్లయింట్స్, ఇతర భాగస్వాములతో, వాటాదారులతో కలిసి పని చేస్తుందని తెలిపారు. ప్రాథమికంగా క్లౌడ్ చుట్టూ ఐటీ సేవలు తిరుగుతున్నాయని అన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు.