IT portal glitches: ఐటీ పోర్టల్లో సమస్యలు గుర్తించిన ఇన్ఫోసిస్
ముంబై: ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్లోని లోపాలను గుర్తించినట్లు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తెలిపింది. పోర్టల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపిన ఈ ఐటీ దిగ్గజం, త్వరలో వాటిని పరిష్కరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ పార్లమెంటుకు తెలిపారు. స్లోగా పని చేయడం, పలు సందర్భాల్లో కొన్ని రకాల సేవలు అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఈ వెబ్ పోర్టల్ను ప్రభుత్వం జూన్ 7వ తేదీన ప్రారంభించింది.
మొదటి నుండి ఇందులో ఇబ్బందులు ఉన్నట్లు పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర వర్గాల వారు ఫిర్యాదులు చేశారు. దీనిని పరిష్కరించేందుకు జూన్ 22వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెబ్సైట్ను తయారు చేసిన ఇన్ఫోసిస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అప్పటి నుండి ఇన్ఫోసిస్ ఈ అంశంపై పని చేస్తోంది.
ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వెబ్ పోర్టల్లో 2000 లోపాలు ఉన్నట్లు తమకు 700 మెయిల్స్ వచ్చాయని, వీటిలో 90 కొత్త రకం సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇన్ఫోసిస్ ఈ వెబ్ పోర్టల్లోని సమస్యలను గుర్తించి అవి సాంకేతిక సమస్యలేనని పేర్కొన్నట్లు తెలిపారు.