మీరు, మేం కలిస్తేనే ఆ లక్ష్యానికి.. 2047 వరకు ఇది సవాల్: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే 25 నుండి 30 సంవత్సరాలలో దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం బిజినెస్, స్టార్టప్ సంస్థలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(FDI)లు 13 శాతం పెరిగాయన్నారు.
2 దశాబ్దాల్లో టాప్ 3 ఆర్థికవ్యవస్థల్లో భారత్: ముఖేష్ అంబానీ ధీమా, జుకర్బర్గ్ ఏమన్నారంటే...
ఇది సవాల్
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. మన ముందు ఓ సవాల్ ఉందని, 2047లో 100వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయానికి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండగలదా? అని వ్యాఖ్యానించారు. భారత్ ఈ రోజు సరఫరా గొలుసులో విశ్వసనీయ భాగస్వామిగా ప్రపంచదేశాలకు కనిపిస్తోందన్నారు.
భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నాం
ఈ రోజు మనం అవకాశాలను అందిపుచ్చుకోకుంటే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవని పీయూష్ గోయల్ అన్నారు. ఇది మనందరి బాధ్యత అని, అవకాశాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను మన మంత్రం, స్ఫూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో సంబంధాలు మరింత పెంచుకోవాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన దేశం ప్రపంచంతో సంబంధాలను మూసివేయడం లేదని, అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తోందన్నారు.
కలిసి పని చేస్తేనే
మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉందని, పనిని వేగవంతంగా చేయడానికి సహాయపడే పరికరాలు అవసరమన్నారు. మంచి నాణ్యత, మంచి ఉత్పాదక ప్రమాణాలు, దేశంలో పోటీ ఉత్పాదక వ్యయం తదితర అంశాల్ని గోయల్ ప్రస్తావించారు.వీటన్నింటిని పెంచడం ద్వారా భారత్ను ప్రపంచ కర్మాగారంగా మార్చవచ్చునని, ఈ రోజున మన దేశాన్ని ప్రపంచ ఫార్మసీగా గుర్తిస్తున్నారన్నారు. మనమంతా ఒకటిగా పని చేద్దామని, కలిసి పని చేద్దామని, 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మరో ఏడెనిమిదేళ్ల సమయం పట్టవచ్చునని చెప్పారు.