టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021 ఏప్రిల్ 1) నుండి కొత్త వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే దీనిని నిలిపివేయాలని ఇండస్ట్రీ బాడీస్ సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కార్మిక మంత్రిత్వ శాఖను కోరనున్నాయి. ఈ మేరకు డిసెంబర్ 24, గురువారం భేటీ కానున్నారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందని, అలాగే సంస్థలపై అదనపు భారం పడుతుందని వారు ఈ సమావేశంలో తెలియజేయనున్నారు.
'ఇతర పరిశ్రమ బాడీలతో కలిసి సీఐఐ, ఎఫ్ఐసీసీఐ ప్రతినిధులు కేంద్రమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలుస్తారు. ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోయే కొత్త వేతన చట్టాన్ని అమలు చేసే అంశంపై చర్చిస్తాం' అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?
టేక్ హోం శాలరీ తగ్గినా.. అప్పుడు ఎక్కువ
కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగులు ఇంటికి తీసుకు వెళ్లే వేతనం తగ్గడమే కాకుండా, యాజమాన్యాలపై భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని పరిశ్రమ బాడీ కేంద్రమంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ సందర్భంగా ప్రస్తావించనుంది. కొత్త చట్టం ప్రకారం పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కోసం వేతనాల్లో కోత ఎక్కువగా ఉంటుంది. దీంతో కార్మికులు ఇంటికి తీసుకు వెళ్లే వేతనాలు తగ్గుతాయి. కానీ పదవీ విరమణ తర్వాత అధిక మొత్తం చేతికి వస్తుంది.
50 శాతం మించరాదు
కొత్త వేతన నిర్వచనం ప్రకారం ఒక ఉద్యోగి మొత్తం వేతనంలో అలవెన్సులు 50 శాతానికి మించరాదు. దీనిని అమలు చేస్తే ఉద్యోగి పీఎప్ మొత్తం పెరుగుతుంది. 12 శాతం వరకు పెరుగుతుంది. కాబట్టి టేక్ హోం శాలరీ తగ్గుతుంది. సంస్థలకు కూడా భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేతన చట్టాన్ని నిలిపివేయాలని పరిశ్రమ కోరనుంది.
ఏమిటిది...
కొత్త వేతన చట్టం ప్రకారం ఉద్యోగి మొత్తం వేతనంలో కాంపెన్షేషన్ 50 శాతం దాటవద్దు. అంటే బేసిక్ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలి. కాంపెన్షేషన్ 50 శాతం మించవద్దంటే బేసిక్ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలంటే.. యాజమాన్యాలు ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉంటుంది. అలా అయితే గ్రాట్యుటీ పేమెంట్స్, ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అప్పుడు ఉద్యోగుల టేక్ -హోం శాలరీ తగ్గుతుంది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ కార్పస్ మాత్రం పెరుగుతుంది.