పారిశ్రామికోత్పత్తి 1.6 శాతం క్షీణత, ఫిబ్రవరిలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్భణం
పారిశ్రామికోత్పత్తి జనవరి నెలలో నేలచూపులు చూసింది. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం వెలువడిన గణాంకాలు నిరాశపరిచాయి. జనవరి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 1.6 శాతం క్షీణించింది. 2020 జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధి నమోదు చేసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్భణం జనవరిలో 4.06 శాతంగా ఉండగా, ఫిబ్రవరిలో 5.03 శాతానికి చేరుకుంది.
గత 3 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఈస్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి 2 శాతం నుండి 6 శాతం శ్రేణిలోనే ఉన్నప్పటికీ, మూడు నెలల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగించే అంశం. ఆర్బీఐ రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్భణమే ప్రాతిపదిక. తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవస్థలో డిమాండ్ పెంపుకు మరో విడత రెపో తగ్గింపునకు రిటైల్ ద్రవ్యోల్బణం అడ్డంకిగా కనిపిస్తున్నాయి.
గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ, గత నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ద్రవ్యోల్బణం భయాలతో యథాతథ రేటును కొనసాగిస్తోంది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు ఆహార ధరల పెరుగుదల కారణం కావడం మరో కీలక అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) గణాంకాలు ఇలా ఉన్నాయి.
మొత్తం సూచీలో దాదాపు 77.6 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి 2020 జనవరితో పోలిస్తే 2021 జనవరిలో 2 శాతం క్షీణించింది. 2020 ఇదే నెలలో ఈ విభాగంలో 1.8 శాతం వృద్ధి నమోదయింది. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు ప్రతిబింబమైన ఈ విభాగంలో క్షీణత 9.6 శాతం క్షీణత నమోదయింది. 2020లో ఇది 4.4 శాతంగా ఉంది.