యస్ బ్యాంకు తర్వాత ఇండస్ఇండ్ ట్రబుల్: రూ.22,000 కోట్ల డిపాజిట్లు వెనక్కి
భారత ప్రయివేటురంగ బ్యాంకులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆదాయాలపై ప్రభావం పడింది. యస్ బ్యాంకు వంటి సహచర బ్యాంకుల పతనం డిపాజిట్లపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంకు పరిస్థితి దారుణంగా ఉందట. యస్ బ్యాంకు సంక్షోబం ప్రస్తుతానికి కుదుటపడింది. కానీ ఈ అంశం వెలుగుచూసినప్పటి నుండి ఇండస్ఇండ్ బ్యాంకు డిపాజిట్లు 10 శాతం మేర తగ్గాయని వార్తలు వచ్చాయి.
అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!
డిపాజిట్లు వెనక్కి
యస్ బ్యాంకు సంక్షోభం వెలుగు చూసిన అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు డిపాజిటర్లు 10 శాతం వరకు వెనక్కి తీసుకున్నారని వెలుగుచూడటంతో ఈ బ్యాంకు షేర్లు మంగళవారం (మార్చి 31) భారీగా నష్టపోయాయి. ఈ బ్యాంకు షేర్ తొలుత పది శాతం, ఆ తర్వాత 15 శాతం కూడా పడిపోయింది. రూ.350కి చేరుకుంది.
రూ.22,000 కోట్లు
ఇండస్ఇండ్ బ్యాంకులోని 10 శాతం నుండి 11 శాతం డిపాజిట్లు ఈ లెక్కన దాదాపు రూ.22,000 కోట్లు డిపాజిటర్లు వెనక్కి తీసుకున్నారు. ఇదంతా డిసెంబర్ క్వార్టర్ నుండి ప్రారంభమైంది. ఇలా వెనక్కి తీసుకున్న డిపాజిట్లలో స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ అంత సేఫ్ కాదని భావిస్తున్నాయట. 75 శాతం డిపాజిట్లు ప్రభుత్వానివే. అంతేకాకుండా హోల్సేల్ అకౌంట్స్ నుండి ప్రీమెచ్యూర్డ్ ఉపసంహరణలు కూడా జరిగాయట. ఓ వైపు డిపాజిట్లు వెనక్కి వెళ్లడం, మరోవైపు కరోనా ప్రభావంతో లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకు పరిస్థితిని దిగజార్చుతున్నాయి.
బ్యాంకు షేర్లు నష్టాల్లో..
ప్రధానంగా కార్డులు, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ లోన్, వెహికిల్ ఫైనాన్సింగ్ బిజినెస్, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఒత్తిడి అనివార్యమని, అయితే మారటోరియం తాత్కాలిక ఊరట అని చెబుతున్నారు. కేవలం ఇదే కాదని, ఇతర బ్యాంకు షేర్లు కూడా నష్టపోతున్నాయని చెబుతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ 34 శాతం, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు షేర్లు కూడా భారీగానే కోల్పోయాయని చెబుతున్నారు.