గుడ్న్యూస్: జాబ్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది, 8.7% తగ్గిన నిరుద్యోగిత రేటు
కరోనా మహమ్మారి తగ్గుతోన్నకొద్దీ భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పుడు సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోన్న సమయంలో సెకండ్ వేవ్ దెబ్బమీద దెబ్బతీసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నుండి కూడా కోలుకుంటోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుతున్న గణాంకాలు నిదర్శనం.
మెరుగుపడుతోన్న వ్యవస్థ
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రయివేట్ లిమిటెడ్ గణాంకాల ప్రకారం జూన్ 13వ తేదీ నాటికి నిరుద్యోగ రేటు 13.6 శాతం నుండి 8.7 శాతానికి తగ్గింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 14.4 శాతం నుండి 9.7 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 13.3 నుండి 8.2 శాతంకు క్షీణించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ తొలగిస్తుండటంతో రవాణా రంగం క్రమంగా మెరుగుపడుతోంది.
నిరుద్యోగిత తగ్గుదల
నిరుద్యోగిత రేటు మే 9 (2021) వారంలో పది శాతం వరకు ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే 16వ తేదీ వారానికి దాదాపు పదిహేను శాతానికి చేరుకుంది. మే 23వ తేదీతో ముగిసిన వారం, మే 30వ తేదీతో ముగిసిన వారాల్లోను ఎక్కువే ఉంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అంత పెరుగుదల నమోదు కాలేదు. జూన్ 6వ తేదీతో ముగిసిన వారానికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు పెరిగి, పట్టణ ప్రాంతాల్లో తగ్గింది. జూన్ 13వ తేదీతో ముగిసిన వారానికి నగర, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత భారీగా తగ్గింది. దీంతో పది శాతం దిగువకు వచ్చింది.
విద్యుత్ వినియోగం పుంజుకుంది
గూగుల్ కమ్యూనికేషన్ మొబిలిటీ నివేదికలో ప్రజారవాణా, ఆఫీసుల్లో మళ్లీ కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లు పేర్కొంది. విద్యుత్ వినియోగం కూడా ఇటీవల కాలంలో బాగా పుంజుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జులై చివరి నాటికి లాక్డౌన్ నిబంధనలు గణనీయంగా సడలించే అవకాశాలు ఉందని, దీంతో మార్చి ముందు నాటి పరిస్థితులు మళ్లీ నెలకొనవచ్చునని, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుందని అంటున్నారు.