భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే? ప్రపంచ బ్యాంకు, రుణస్థాయి ఎంత పెరిగిందంటే
కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 9.6 శాతం నమోదు కావొచ్చునని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్లస్ 5.4 శాతంగా నమోదు కావొచ్చునని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. డ్రాగన్ దేశంలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతానికి పతనమైంది. ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటుండటంతో జీడీపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు జీడీపీని సవరించింది.
బెజోస్, మస్క్ 2020 ఆదాయంతో 10 కోట్లమంది అమెరికన్లకు 2000 డాలర్ల చొప్పున పంచవచ్చు
భారత, ప్రపంచ జీడీపీ
ప్రయివేటు పెట్టుబడులు నీరసించడం, కుటుంబాల ఖర్చులు తగ్గిపోవడం వంటి వివిధ కారాణాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్ 9.6 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం భారీగా పుంజుకుంటుందని తెలిపింది. కరోనా కారణంగా 2020లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు గత ఏడాదితో పోలిస్తే మైనస్ 4.3 శాతానికి చేరుకోవచ్చునని పేర్కొంది. 2021 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం కాస్త కోలుకుని 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. 2022లో 3.8 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది.
రికవరీపై ప్రతికూల ప్రభావం
మహమ్మారి ప్రభావం ఉండటం, ఇతర ప్రతికూలతలు రికవరీపై ప్రభావం చూపే అవకాశముందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్(EMDEs) వృద్ధి 2021లో ఐదు శాతం వరకు ఉండవచ్చునని తెలిపింది. అయితే EMDEs ఉత్పత్తి కూడా కరోనా ముందు నాటి అంచనాలతో మెరుగ్గా ఉండవచ్చునని వెల్లడించింది.
రుణస్థాయిలు పెరిగాయి
కరోనా కారణంగా ప్రపంచంపై ఒక దశాబ్ద రుణ ప్రభావం పడిందని తెలిపింది. రుణ పరిమితులు చారిత్రక గరిష్టాలను తాకాయని, కరోనా ప్రభావం సుదీర్ఘకాలం ఉండవచ్చునని, లాంగ్ టర్మ్ మందగమనానికి కారణం అయిందని తెలిపింది. ఇది పేదరికం తగ్గించే అవకాశాలు సన్నగిల్లేలా చేసిందని వెల్లడించింది.