వ్యాక్సీన్ కోసం ఏడాది పాటు వేచి ఉండే పరిస్థితి ఉంటే..:భారత ఆర్థిక వ్యవస్థపై బ్యాంక్ ఆఫ్ అమెరికా
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా భారీగా ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయంపడుతుందని వివిధ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్(BofA) భారత వృద్ధిరేటు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కరోనా వ్యాక్సీన్ రావడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వృద్ధి రేటుతో పాటు దాదాపు అన్ని దేశాల వృద్ధి రేటు క్షీణిస్తాయని వివిధ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఇక చైనాకు చెక్, భారత్ టాప్ వ్యాపార భాగస్వామిగా అమెరికా! అగ్రరాజ్యంతో మరింత దృఢంగా..
కరోనా ఆలస్యమైతే..
కరోనాకు వ్యాక్సీన్ మరీ ఆలస్యమైతే 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసే అవకాశముందని, వ్యాక్సీన్ త్వరగా వస్తే మాత్రం నాలుగు శాతం ప్రతికూలత ఉండవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ బ్యాంకు ఆర్థికవేత్తలు రియల్ జీడీపీ అంచనాలను వారం రోజుల్లోనే మళ్లీ సవరించారు.
వ్యాక్సీన్ కోసం ఓ సంవత్సరం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటే..
కరోనా వ్యాక్సీన్ కోసం ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనికి ఎంత కాలం పడుతుందో తెలియట్లేదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై వ్యాక్సీన్ ప్రభావం ఎంతో ఉంటుంది. అలాగే భారత వృద్ధిపై కూడా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భారత జీడీపీ 5 శాతం క్షీణిస్తుందని కొన్ని సంస్థలు చెబుతుంటే, 7.2 సంకోచం కూడా ఉండవచ్చునని చెబుతున్నారు. వ్యాక్సీన్ కోసం ప్రపంచం, భారత్ ఒక సంవత్సరం వేచి చూసే పరిస్థితి ఉంటే భారత జీడీపీ 7.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని BofA విశ్లేషకులు తెలిపారు.
ఒక్కో నెల.. ఒక శాతం
అంతకుముందు క్లిష్ట పరిస్థితుల్లో 5 శాతం ప్రతికూలత నమోదవుతుందని అనలిస్ట్లు అంచనా వేశారు. ప్రతి నెల లాక్ డౌన్ కారణంగా ఒక శాతం చొప్పున వృద్ధిపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ మరో రెండు శాతం రెపో రేటును కట్ చేయవచ్చునని భావిస్తున్నారు.
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, లాక్ డౌన్ ముగిసి.. అన్-లాక్ లోకి ప్రవేశించిన తర్వాత మూడు రెట్లు పెరిగాయని, కాబట్టి ప్రస్తుత ఆంక్షలు సెప్టెంబర్ మిడిల్ వరకు కొనసాగవచ్చునని చెబుతున్నారు.