అమెరికా, భారత్ సహా బేజారు, చైనా, టర్కీ మాత్రమే అదుర్స్
ప్రపంచంలో జీడీపీ పరంగా భారత్ 5వ స్థానంలో ఉంది. ఆసియాలో చైనా, జపాన్ తర్వాత మూడో స్థానం మన దేశానిది. భారత జీడీపీ గణాంకాలు సోమవారం వెల్లడైన విషయం తెలిసిందే. చివరిసారి 1979-80లో జీడీపీ మైనస్ 5.2 శాతంగా నమోదు కాగా, మళ్లీ నలభై సంవత్సరాల తర్వాత FY21లో జీడీపీ వృద్ధిరేటు మైనస్ 7.3 శాతంగా నమోదయింది. కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించి వృద్ధి రేటు క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మాత్రం 1.6 శాతం వృద్ధి రేటు నమోదయింది.
గత ఏడాది ఇదే సమయంలో 3 శాతంగా నమోదయింది. భారత జీడీపీ త్రైమాసికం పరంగా 2019-20 మొదటి త్రైమాసికంలో 5.4 శాతం కాగా, క్రమంగా తగ్గి కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం నమోదయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ ప్రస్తుతం 1.6 శాతంగా నమోదయింది. వార్షిక ప్రాతిపదికన 2016-17లో 8.3 శాతం, 2017-18లో 7 శాతం, 2018-19లో 6.1 శాతం, 2019-20లో 4 శాతం, 2020-21లో మైనస్ 7.4 శాతం నమోదయింది.
ప్రపంచ జీడీపీలో భారత్ ఐదో స్థానం
ప్రపంచ దేశాల్లో జీడీపీ పరంగా భారత్ ఐదో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ ఉంది. FY21లో భారత జీడీపీ 8 శాతం తగ్గుతుందని NSO, 7.5 శాతం తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. కానీ అంచనాల కంటే కాస్త సానుకూలంగా వృద్ధి రేటు నమోదయింది. అయినప్పటికీ భారీ ప్రతికూలత నమోదయింది. కరోనా పుట్టిన డ్రాగన్ కంట్రీ చైనాలో జనవరి-మార్చి (2021) కాలంలో జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 18.3 శాతంగా నమోదయింది.
ఆ దేశాల వాటా 78 శాతం
2020లో ప్రపంచ దేశాలు కరోనాతో వణికిపోయాయి. దాదాపు అన్ని దేశాలు కూడా ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక అగ్రరాజ్యాల్లో చైనా కాస్త సానుకూలంగా ఉంది. మిగతా దేశాల విషయానికి వస్తే గయానా (43.38 శాతం) ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తోన్న దేశంగా నిలిచింది.
ఆ తర్వాత ఇథియోపియా (6.1 శాతం), గునియా (5.2 శాతం), తజకిస్తాన్ (4.5 శాతం) వృద్ధి రేటు అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈ నాలుగు దేశాలు మాత్రమే 4 శాతం కంటే పైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయని అంచనా. 194 ప్రపంచ దేశాల్లో 166 ఆర్థిక వ్యవస్థలు 2020లో ప్రతికూల వృద్ధి రేటుతో ఉన్నాయి. ఈ దేశాల ఎకానమీ ప్రపంచ ఎకానమీలో 78 శాతంగా ఉంది.
ఇతర దేశాలతో పోలిస్తే...
కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకొని 2020 క్యాలెండర్ ఏడాది డిసెంబర్ నాటికి రికార్డుస్థాయిని అందుకున్నాయి. 26 మే 2020 నుండి 31 డిసెంబర్ 2020 మధ్య కాలంలో అమెరికా ఎస్ అండ్ పీ 500 సూచీ 11.7 శాతం, షాంఘై కాంపోజిట్ 3.5 శాతం, జపాన్ నిక్కీ 4.4 శాతం, బ్రిటన్ ఎప్టీఎస్ఈ 100 సూచీ 8.8 శాతం, జర్మనీ డాక్స్ 12.6 శాతం, స్విట్జర్లాండ్ ఎస్ఎంఐ 6 శాతం ఎగిశాయి. భారత్ బీఎస్ఈ 6.8 శాతం ఎగిసింది.
అలాగే పెద్ద ఆర్థిక వ్యవస్థల రియల్ జీడీపీ విషయానికి వస్తే సౌదీ మైనస్ 4.1 శాతం, అమెరికా మైనస్ 3.5 శాతం, రష్యా మైనస్ 3.1 శాతం, జర్మనీ మైనస్ 4.9 శాతం, ఫ్రాన్స్ మైనస్ 8.2 శాతం, యూకే మైనస్ 9.9 శాతం, జపాన్ మైనస్ 4.8 శాతం నమోదయ్యాయి. భారత్ మైనస్ 7.3 శాతంగా (FY21) ఉంది. సానుకూల వృద్ధి నమోదైన దేశాల్లో టర్కీ (1.8 శాతం, చైనా (2.3) శాతం) ఉన్నాయి.
వృద్ధిలో క్షీణత
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగా ఉండకపోవచ్చునని సీఈఏ కేవీ సుబ్రమణియన్ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేయడం కష్టమేనని అంటున్నారు. వ్యాక్సీన్ వేగం పెరగాల్సి ఉందని, అపుడే మరో దశ కరోనా వచ్చే అవకాశాలను తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు అంచనాల కంటే మెరుగ్గా గణాంకాలు నమోదైనా భారీ మార్పులేదని, కరోనా మలి దశ కారణంగా 10 శాతం లోపు వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.