అమ్మో అమెరికన్ చికెన్ లెగ్స్.. వస్తే పరిస్థితి ఏమవుతుందో?
అమెరికన్ చికెన్ లెగ్స్.. ఈ మాట వినగానే మన దేశ పౌల్ట్రీ రంగం ఒకింత ఆందోళనకు గురవుతోంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత ప్రభుత్వం ఆ దేశ చికెన్ లెగ్స్ దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గిస్తే పరిస్థితులు ఏవిధంగా ఉంటాయోనన్న భయాందోళనలు పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అమెరికా కంపెనీలు మనదేశంలోని ప్రవేశించి ఏవిధంగా మార్కెట్ ను హస్తగతం చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ- కామర్స్, ఐటీ, రిటైల్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఈ దేశ కంపెనీలు ఏ విధంగా విస్తరించాయో తెలిసిందే. ఇప్పుడు పౌల్ట్రీ రంగంలోకి కూడా ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందోనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ధరలు తగ్గనున్నాయా?: అమెరికా చికెన్పై భారీగా తగ్గనున్న దిగుమతి సుంకం
అమెరికా ఒత్తిడి...
అమెరికా నుంచి దిగుమతి అవుతున్న చికెన్ పై ప్రస్తుతం వంద శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. దీన్ని 30 శాతానికి తగ్గించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం పై సంతకాలు చేస్తే సుంకాన్ని తగ్గించాల్సి వస్తుంది. ఈ దిశగా ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందం పట్ల దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒప్పందం జరిగితే అమెరికా నుంచి చికెన్ దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి దేశీయ పరిశ్రమ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
* అమెరికా చికెన్ లెగ్స్ మూలంగా దేశీయంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చికెన్ ఫారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు మూతపడవచ్చని అంటున్నారు.
అక్కడ తినే వారు లేరు.. అందుకే మన దేశంపై కన్ను
అమెరికన్లు కోడి బ్రెస్ట్ మాంసాన్ని తినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీని కోసం ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వారు వెనుకాడరు. చికెన్ లెగ్స్ తినరు. కాబట్టి ఈ లెగ్స్ ను ఇతర దేశాలకు అమెరికా పంపుతుంది. యూరోపియన్ దేశాలతో పాటు చైనాకు ఎక్కువగా ఎగుమతి చేసేది. అయితే ఇప్పుడా దేశాల్లోనే చికెన్ ఎక్కువయింది. అంతే కాకుండా చైనాతో అమెరికాకు చెడింది. ఈ నేపథ్యంలో మన దేశంపై అమెరికా కన్ను పడింది. మన దేశంలో జనాభా ఎక్కువ.. చికెన్ వినియోగం కూడా పెరుగుతోంది. అందుకే ఇక్కడి మార్కెట్లోకి చికెన్ లెగ్స్ పంపిస్తే సరిపోతుందన్నది అమెరికా ఉద్దేశం. అయితే దిగుమతులపై వంద శాతం సుంకం ఉన్నందువల్ల దీన్ని భారీగా తగ్గించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. మిగిలి పోయిన చికెన్ లెగ్స్ ను నిల్వ చేయలేక ఎదో ఒక దేశానికి పంపడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
భారత పౌల్ట్రీ రంగం ఎలా ఉందంటే..
* దేశ స్థూల జాతీయోత్పత్తిలో పౌల్ట్రీ రంగం పాత్ర చాలా కీలకంగా ఉంది.
* లక్ష కోట్ల రూపాయల పరిమాణం కలిగిన ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
* వీరిలో 20 లక్షల మంది మొక్క జొన్న, సోయాబీన్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండింటిని కోళ్ల దాణాలో ప్రధానంగా వినియోగిస్తున్నారు.
* దేశంలో 8800 కోట్ల గుడ్లు, 400 కోట్ల బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి జరుగుతోంది. పౌల్ట్రీ విషయంలో చైనా తర్వాతి రెండో స్థానంలో భారత్ ఉంది.
ప్రభావం ఎంత?
* అమెరికా చికెన్ లెగ్స్ భారత మార్కెట్ ను ముంచెత్తితే దేశీయ పౌల్ట్రీ రంగంపై ప్రభావం ఉండటానికి అవకాశం ఉంటుందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
* తక్కువ ధరకే చికెన్ ను అందించే అవకాశం ఉన్నందువల్ల కొనుగోలు దారులు ఆసక్తి చూపడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
* దిగుమతులు మార్కెట్ ను ముంచెత్తితే దేశీయ పౌల్ట్రీ పరిశ్రమతో పాటు వ్యవసాయ రంగంపైనా ప్రభావం ఉండవచ్చన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
* ధర తక్కువ ఉండే అవకాశం ఉన్నా నిల్వ చేసిన చికెన్ లెగ్స్ ను మనదేశానికి పంపుతారు కాబట్టి వాటిని ఎక్కువ మంది ఇష్టపడక పోవచ్చని కూడా కొంత మంది చెబుతున్నారు.
* రుచి లోనూ తేడా ఉండవచ్చని అంటున్నారు. అయితే అమెరికా చికెన్ లెగ్స్ మన మార్కెట్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటే మరి కొంత కాలం వేచి చూడాలని పరిశీలకులు అంటున్నారు.