నాటి బుల్ మార్కెట్ ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది: మోర్గాన్ స్టాన్లీ
ప్రస్తుత భారత బుల్ మార్కెట్ 2003-08లోని ధోరణికి అద్దం పడుతోందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. స్టాక్ మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని తెలిపింది. గత ఏడాది మార్చి నెలలో నమోదయిన కనిష్ఠస్థాయి నుండి బుల్ మార్కెట్ ప్రారంభమైందని, ఇది ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుందని తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు షేర్ల వ్యాల్యూను లెక్కించే సమయంలో PE నిష్పత్తి కంటే ప్రైస్ టు బుక్ వ్యాల్యూను(PBV) పరిగణనలోకి తీసుకోవడం మేలు అని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.
బుల్మార్కెట్లో గరిష్ఠంగా సగటు PBV 5.2 వరకు నమోదయినట్లు, ప్రస్తుతం ఇది 3.6 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గతంలో నాలుగు సందర్భాల్లో సగటున బుల్ మార్కెట్ 72 వారాలు ఉన్నట్లు, ప్రస్తుత బుల్ మార్కెట్ 64 వారాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. 2003-08 మార్కెట్ ధోరణి ఇప్పుడు కనిపిస్తోందని, అప్పుడు 246 వారాలు కొనసాగిందని, ఇప్పుడు మరో ఏడాది పాటు దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్లిష్ ధోరణి కొనసాగ వచ్చునని అంచనా వేసింది.
సమీప భవిష్యత్తులో వినియోగ వస్తువులు, ఉత్పత్తిరంగ పరిశ్రమలు, ఆర్థిక సేవల రంగాల కంపెనీలు మెరుగైన ఆదాయాలు నమోదు చేస్తాయని భావిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈక్విటీ ఇష్యూయెన్స్ సైకిల్ ప్రారంభ దశలో ఉందని, ఇది ఎప్పుడైనా మూడు నుండి ఐదు రెట్ల వరకు పెరగవచ్చునని పేర్కొంది.