దెబ్బమీద దెబ్బ: ఆ దేశాల ప్రభావం.. మన ఐటీ రంగానికి నష్టం!
కరోనా మహమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగం ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం వరకు తగ్గిపోవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ వైరస్ వల్ల, విమానయానం, ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కాబట్టి కాంట్రాక్టులు 7 శాతం నుండి 9 శాతం మేర తగ్గవచ్చునని పేర్కొంది. కరోనా కారణంగా వివిధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
అలా చేస్తాం.. కానీ ఒక్క ఉద్యోగినీ తొలగించం, ట్రంప్ నిర్ణయం దురదృష్టకరం: విప్రో ప్రేమ్జీ
ఆదాయ దేశాలపై భారీ దెబ్బ
గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 6 శాతం నుండి 8 శాతం వృద్ధి సాధిస్తుందని ఇక్రా అంచనా వేసింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో దానిని సవరించి, 3 శాతం తగ్గిపోవచ్చునని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ నాటికి టీసీఎస్ ప్రకటించిన ఫలితాల్లో ఆదాయం, లాభాలు తగ్గాయి. మూడో క్వార్టర్ నాటికి ప్రీ-కోవిడ్ పరిస్థితికి పుంజుకుంటామని తెలిపింది. టీసీఎస్ సహా వివిధ ఇండియన్ ఐటీ దిగ్గజాలకు అమెరికా, యూరోప్ దేశాల నుండి వచ్చే ఆదాయం ఎక్కువ. కరోనా వల్ల ఆ దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆ దేశాల జీడీపీ ప్రభావం
అమెరికా, యూరోప్ దేశాల జీడీపీ వరుసగా 8.0, 10.2 శాతం చొప్పున క్షీణిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ మెరకు ఐటీ కంపెనీపై ప్రభావం ఉంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ అన్నారు. ఈ దేశాల ఐటీ ఎగుమతులు 80 శాతం వరకు ఉంటాయి. కాబట్టి కొత్త కాంట్రాక్టులు 7-9 శాతం తగ్గిపోతాయని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు 90 శాతం ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తోందని తెలిపింది.
ఐటీ రంగానికి దెబ్బమీద దెబ్బ
2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరానికి (2021-22) క్రమంగా కోలుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆపరేషనల్ ఒత్తిళ్లు, వీసా నియంత్రణలు, కార్యాలయంలో కరోనా జాగ్రత్తలు... ఇలా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. దీనికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. కరోనా ప్రభావం ఐటీ రంగంపై నేరుగా చూపకపోయినప్పటికీ క్లయింట్స్ పైన ప్రభావం.. ఈ రంగంపై పడుతోంది.