ఐటీ పరిశ్రమ అదుర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్తో పోటీ ప్రయోజనం: అజీమ్ ప్రేమ్జీ
భారతీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) డబుల్ డిజిట్ వృద్ధి రేటును సాధిస్తుందని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో ఈ ప్రపంచాన్ని ఐటీ నడిపిస్తోందని, అలాగే, మార్పులు తీసుకు వస్తోందన్నారు. మంగళవారం సాయంత్రం బాంబే చార్టర్డ్ అకౌంట్స్ సొసైటీ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. నాస్కాం డేటా ప్రకారం ఐటీ ఇండస్ట్రీ రెవెన్యూ FY21లో 194 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ గురువారం నుండి వివిధ ఐటీ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
డబుల్ డిజిట్ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో(2021-22) ఐటీ పరిశ్రమ డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తే తాను ఏమీ ఆశ్చర్యపోనని, ఓ వైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఐటీ పరిశ్రమ రెండు శాతం నుండి మూడు శాతం వృద్ధి చెందిందని, 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ప్రేమ్జీ అన్నారు. కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కలిగిందన్నారు. 90 శాతం మంది ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నారని తెలిపారు.
నైపుణ్య కేంద్రంగా..
ఇల్లు, కార్యాలయం మధ్య సమన్వయం కొనసాగిస్తూ నిర్వహిస్తోన్న ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ పోటీ ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మెరుగైన భాగస్వామ్యానికి అవకాశం ఉండటంతో పాటు, మహిళలు వారి వృత్తిని కొనసాగించే సౌలభ్యాన్ని కల్పిస్తుందన్నారు. అంతర్జాతీయంగా భారత్ను నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు అందరు కలిసి పని చేయాల్సిన అవశ్యతను అజీమ్ ప్రేమ్జీ గుర్తు చేశారు.
భారత్ లక్ష్యం
అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే భారత్ లక్ష్యానికి ఐటీ పరిశ్రమ దోహదపడుతుందన్నారు. అలాగే, కోవిడ్ 19 పైన పోరు కోసం విప్రో రూ.1000 కోట్లు కేటాయిస్తుందని అజీమ్ ప్రేమ్ జీ అన్నారు. దేశంలో స్కూల్స్ రీ-ఓపెనింగ్ పైన ఆయన ఆశాభావ దృక్ఫథంతో ఉన్నారు.