2022 నాటికి ఐటీ సంస్థల్లో 30 లక్షల ఉద్యోగాల కోత, లక్షల కోట్ల శాలరీ వ్యయం ఆదా
అన్ని రంగాల్లోనూ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీకి మారుతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయ సాఫ్టువేర్ రంగంలో 1.6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2022 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన ముప్పై లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయని తెలిపింది. ఇందులో అత్యధికంగా వేతన రూపంలో ఏడాదికి 100 బిలియన్ డాలర్లను కంపెనీలు ఆదా చేసుకోవచ్చునని వెల్లడించింది.
తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు షాక్
నాస్కాం ప్రకారం ఐటీ రంగంలో దాదాపు 16 మిలియన్ల ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు, బీపీవో రంగంలో ఉన్నారు. ఇండియన్ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ ఇతర టెక్ కంపెనీలు రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) అప్స్కిల్లింగ్ కారణంగా 2022 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను మూడు మిలియన్ల మేర తగ్గించాలని యోచిస్తున్నాయి. అమెరికాలో ఆర్బీఏతో పది లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా.
ఆదా చేసుకోవడానికి...
భారత్లో అవసరాల కోసం పని చేస్తోన్న ఒక్కో ఉద్యోగి సగటు వార్షిక వేతనం 25,000 డాలర్లు, అమెరికా అవసరాల కోసం పని చేస్తోన్న వారికి 50,000 డాలర్ల మేర చెల్లిస్తున్నారు. తొలగించాలని భావిస్తున్న వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాలు, ఇతర వ్యయాల కోసం దాదాపు రూ.7.5 లక్షల కోట్ల మేర కార్పొరేట్ సంస్థలు ఆదా చేసుకోవాలని చూస్తున్నాయని పేర్కొంది. ఆర్పీఏ అప్-స్కిల్లింగ్తో 2022 నాటికి తక్కువ నైపుణ్యం ఉన్న ముప్పై లక్షలమందిని తగ్గించుకోవాలని దేశీయ ఐటీ దిగ్గజాలు ప్లాన్ చేస్తున్నాయి.
మనుషులతో పోలిస్తే 24 గంటలు పని
మనుషులతో పోలిస్తే రోబోలు 24 గంటలు పని చేస్తాయని, ఆర్పీఏను ఐటీ సంస్థల్లో విజయవంతంగా అమలు చేస్తే 10:1 నిష్పత్తిలో వ్యయాలు ఆదా అవుతాయని నివేదిక తెలిపింది. దేశీయ ఐటీ రంగానికి ఆఫ్ షోరింగ్ ఎంతో చేసింది. 1998లో జీడీపీలో ఈ రంగం వాటా 1 శాతం కాగా, ఇప్పుడు 7 శాతానికి చేరుకుంది. మరోవైపు, యాంత్రీకరణ ఉన్నప్పటికీ జర్మనీ, చైనా, భారత్, కొరియా, బ్రెజిల్, థాయ్లాండ్, మలేషియా, రష్యా కూడా నిపుణుల కొరతను ఎదుర్కోనున్నాయి.