భారత ఐటీ కంపెనీలకు కష్ట కాలం ... ఎందుకంటే!
దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్ట కాలం మొదలైంది. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలకు వర్తిస్తుంది. ఇటీవల ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో వెలుగు చూసిన ఆరోపణలు కూడా ఈ విషయాన్నీ కొంత వరకు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఇన్ఫోసిస్ సహా చాలా కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆందోళనకు గురవుతున్నారు. 2008 లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మందగమనం కంటే కూడా ఈ సారి అధిక ప్రభావం చూపే పరిణామాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. దీనికి అసలు కారణం ఏమిటంటే మన ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే ఫారిన్ కంపెనీలు తమ కాంట్రాక్టుల్లో మార్జిన్లు తగ్గిస్తున్నాయి. గతంలో చేసిన కాంట్రాక్టు విలువ కంటే కొత్త కాంట్రాక్టు విలువ తగ్గుతూ వస్తోంది. దీంతో మన కంపెనీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. తక్కువ విలువున్న కాంట్రాక్టు ఒప్పుకోక పోతే ... అసలు కొత్త కాంట్రాక్టులు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఐటీ కంపెనీలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతున్నాయి.
20 శాతానికి పైగా కోత ...
భారత సాఫ్ట్ వేర్, దాని అనుబంధ కంపెనీలు అధికంగా అమెరికా కాంట్రాక్టులపై ఆధారపడతాయి. ఒకప్పుడు కేవలం అమెరికా నుంచే మన కంపెనీలకు సగానికి పైగా కాంట్రాక్టులు లభించేవి. ఆ తర్వాత యూరోప్ నుంచి భారీ కాంట్రాక్టులు దక్కేవి. కానీ 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత ఐటీ కంపెనీలు కాంట్రాక్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద మార్కెట్ల కూ విస్తరించాయి. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లపై దృష్టి సారించాయి. ప్రస్తుతం మొత్తం కాంట్రాక్టుల్లో సుమారు మూడో వంతు అమెరికా నుంచి వస్తుండగా, యూరోప్ సహా మిగితా దేశాలన్నీ 60 శాతానికి పైగా కాంట్రాక్టులను అందిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అమెరికా సహా అన్ని దేశాల నుంచి మన ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే కంపెనీలు బేరమాడుతున్నాయి. ఒకప్పుడు 10 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టు పనిని ప్రస్తుతం 8 మిలియన్ డాలర్ల కె చేయాలనీ పట్టుపడుతున్నాయి. లేదంటే కాంట్రాక్టు రద్దు చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.
ఒత్తిడిలో మన కంపెనీలు...
ఇలా కాంట్రాక్టుల విలువను తగ్గించి చేయమనటంతో ... భారత ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. సాధారణంగా సాఫ్ట్ వేర్ ప్రాజెక్టుల్లో సుమారు 40 శాతం వరకు మార్జిన్లు ఉంటాయని అంతర్గత వర్గాల సమాచారం. కానీ ప్రస్తుతం అవి 20% లోపునకు పడిపోతున్నాయని కంపెనీలు వాపోతున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చులు, పెరిగిన పన్నులు భరిస్తూ కొత్త కాంట్రాలు రావటంలో ఆలస్యం అయితే, ఆ మాత్రం మార్జిన్లు కూడా ఆవిరి అయిపోతున్నాయట. అందుకే, చాలా కాలంగా పనిచేస్తున్న కంపెనీలు విలువ తగ్గించినా ఓకే అనాల్సి వస్తుందట. కాంట్రాక్టులు ఇచ్చే కంపెనీలకు కూడా ఐటీ రంగంపై పూర్తి స్థాయి అవగాహన రావటంతో ఇలా బేరమాడుతున్నాయట.
ఆటోమేషన్...
కాగా, పరిస్థితిని అంచనా వేస్తున్న భారత ఐటీ కంపెనీలు... మార్జిన్ల ఒత్తిడిని తట్టుకునేందుకు కొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి. ఇందుకోసం ఆటోమేషన్ అధికంగా వినియోగిస్తున్నాయి. అలాగే తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించే పనిలో పడ్డాయి. ఇలా చేయటం వల్ల స్వల్ప కాలంలో కొంత మార్జిన్లు తగ్గినా... ఆటోమేషన్, అధిక ఉత్పాదకత కారణాలతో దీర్ఘకాలంలో కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త క్లయింట్ ను సాధించే కన్నా ఆల్రెడీ పని చేస్తున్న పాత క్లయింట్ ను రెటైన్ చేసుకొనేందుకు మన కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఎందుకంటే... ఇప్పటికే వారితో పనిచేసిన అనుభవం వల్ల కొత్త ప్రాజెక్టును అనుకొన్న సమయానికంటే ముందు డెలివరీ చేయగలుగుతున్నారు.
50 లక్షల మంది ఉద్యోగులు ...
భారీ ఐటీ , దాని అనుబంధ రంగాల మార్కెట్ ప్రపంచంలోనే అతి పెద్దది. 2018-19 లో ఏకంగా 181 బిలియన్ డాలర్లు (సుమారు రూ 12,67,000 కోట్లు) గా ఉంది. ఇందులో మన దేశం నుంచి విదేశాలకు చేసే ఎగుమతులు 137 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 9,59,000 కోట్లు) గా ఉంది. ఇక దేశీయ ఐటీ రంగ మార్కెట్ పరిమాణం 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ 3,08,000 కోట్లు) గా నమోదు అయింది. అదే సమయంలో భారత దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్ వేర్ నిపుణులకు ఈ రంగం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా ఈ సంఖ్య కోటికి పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.