FY23లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం వరకు... ఎందుకంటే
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుండి 7.8 శాతం మధ్య ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ వృద్ధి బాగుండటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలు ఇందుకు దోహదపడుతున్నట్లు చెబుతున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లలో ఎక్కువగా అంతర్జాతీయ పరిస్థితులేనని, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు లేకుంటే దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా కరోనా ఉద్దీపన చర్యలను భారత్ తీసుకుందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధనం, కమోడిటీ ధరల వల్ల ద్రవ్యోల్భణం ఉన్నట్లుండి పెరిగిందని, ఇంధనంపై సుంకాల రాయితీ వల్ల వచ్చే త్రైమాసికాల్లో ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం వృద్ధి రేటు లభించవచ్చునని చెప్పారు.
బలమైన వృద్ధి ధోరణి కనిపిస్తోందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తున్నాయని, అందుకే రియల్ జీడీపీ వృద్ధి 7 శాతం నుండి 7.8 శాతం మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. ఇంధనం, ఎరువుల దిగుమతి వ్యయాల భారం భారత్ పైన ప్రభావం చూపించవచ్చునని చెప్పారు. అయితే వ్యవసాయ దిగుబడుల ఉత్పత్తికి తోడు, ధాన్యాల ఎగుమతుల వల్ల భారం తగ్గవచ్చునని చెప్పారు.