భారత ఆర్థిక వ్యవస్థ దారుణ పతనం, 90% రుణరేటు: మూడీస్
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ మైనస్ 11.5 శాతానికి క్షీణించవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ అంచనా వేసింది. అంతకుముందు ఏడాది మైనస్ 4 శాతంగా అంచనా వేసింది. గత క్వార్టర్లో మైనస్ 23.9 శాతం వృద్ధి నేపథ్యంలో అంచనాలను మైనస్ 11.5 శాతానికి సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం వృద్ధిరేటు 10.6 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. ఫిచ్ రేటింగ్స్ మైనస్ 10.5 శాతం, క్రిసిల్ రేటింగ్స్ మైనస్ 9 శాతం, ఇండియా రేటింగ్స్ మైనస్ 11.8 శాతం, గోల్డ్మన్ శాక్స్ మైనస్ 14.8 శాతం అంచనా వేసిన విషయం తెలిసిందే. కేర్ రేటింగ్స్ కూడా మైనస్ 8 శాతం నుండి మైనస్ 8.2 శాతానికి క్షీణించవచ్చునని కేర్ రేటింగ్స్ తెలిపింది.
రీస్కిల్-రీస్టార్ట్, 500 మంది ఉద్యోగుల్ని తీసుకోనున్న ఇన్ఫోసిస్
జీ20 దేశాల్లో భారీ పతనం
G-20 దేశాల్లో ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమవుతున్న దేశాల్లో భారత్ కూడా ఉందని మూడీస్ తెలిపింది. సమీప భవిష్యత్తులో కుదురుకునే అవకాశాలు లేవని వెల్లడించింది. అయితే ఎకనమిక్ డెవలప్మెంట్స్, పాలసీలకు అనుగుణంగా అంచనా రేట్లను మార్చే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ ఆదాయనికి కూడా గండి పడినట్లు తెలిపింది. తక్కువ వృద్ధి, బలహీన ఆర్థిక వ్యవస్థ వల్ల భారత రుణ ప్రొఫైల్ పైన ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది. కరోనా వేగంగా వ్యాప్తిస్తుండటం వల్లే ఇవి జరుగుతున్నాయని తెలిపింది.
జీడీపీలో 90 శాతానికి చేరనున్న రుణాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాలు జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని అంచనా వేసింది. అంత క్రితం ఏడాది జీడీపీలో 72 శాతానికి చేరుకుంటాయని తెలిపింది. ద్రవ్యలోటు 4.6 శాతంగా నమోదయింది. కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు వరుసగా 7.5 శాతం, 4.5 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వస్తు వినియోగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు తగ్గడంతో చాలా రంగాలు పరపతి సామర్థ్యం బలహీనపడుతోందని మూడీస్ పేర్కొంది.
ఎయిర్టెల్ రేటింగ్..
భారతీ ఎయిర్టెల్ భవిష్యత్తు రుణ రేటింగ్ను ప్రతికూలం నుండి స్థిరంకు మూడీస్ సవరించింది. టెలికం రంగంలో పోటీ తగ్గడం, 4జీ వినియోగదారులు, మొబైల్ సేవల టారిఫ్స్ పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. ఏజీఆర్ సంబంధిత బకాయిల విషయంలో కంపెనీగా పెద్దగా ఇబ్బంది ఉండదనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని రేటింగ్ను సవరించింది.