సంక్షోభంలో మన పరిశ్రమలు మెరుగ్గా స్పందిస్తున్నాయి: దాస్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి క్రమంగా కోలుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆయన ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాన్క్లేవ్లో మాట్లాడారు. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసి అన్-లాక్ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోన్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. విశ్వాసం పునరుద్ధరించడం, ఆర్థిక స్థిరత్వం కాపాడటం, వృద్ధి పునరుద్ధరణ, బలంగా కోలుకోవడం ఇప్పుడు అవసరమన్నారు.
ఆ ప్యాకేజీ సరిపోదు, ఆ రెండే కరోనా సంక్షోభం నుండి కాస్త గట్టెక్కిస్తాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్
సంక్షోభంలో మన పరిశ్రమ మెరుగ్గా రాణించింది
భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోన్న సంకేతాలు కనిపిస్తున్నాయని దాస్ చెప్పారు. భారతీయ కంపెనీలు, పరిశ్రమలు సంక్షోభం సమయంలో మెరుగ్గా రాణించిందన్నారు. సరఫరా వ్యవస్థ తిరిగి ప్రారంభమైందని, కానీ పూర్తిగా ఎప్పుడు వస్తుందో, డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో అనిశ్చితి ఉందని, దీనిపై మరెంత ప్రభావం ఉంటుందనేది ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
రెగ్యులేటరి రిలాక్షేషన్స్ లేకుండా
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఆర్థిక వృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు ఉపయోగపడుతుందని దాస్ అన్నారు. ఆర్థిక స్థిరత్వం కాపాడటం కోసం, బ్యాంకింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహించడం కోసం, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడంలో సమతుల్యత కోసం కేంద్ర బ్యాంకు కృషి చేస్తుందన్నారు. ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ రిలాక్సేషన్స్ పైన ఆధారపడకుండా సాధారణ తీరుకు రావాలని ఆకాంక్షించారు.
నిరర్థక ఆస్తులు పెరిగే అవకాశం
మందగమనం, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తోడ్పాటుకు 2019 ఫిబ్రవరి నుండి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు (2.5 శాతం) తగ్గించినట్లు తెలిపారు. వృద్ధి రేటుతో పాటు ఆర్థిక స్థిరత్వంపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, తిరిగి కోలుకునే శక్తికి కరోనా సంక్షోభం ఓ పరీక్షగా నిలిచిందన్నారు. మార్కెట్లో విశ్వాసం పెంచేందుకు ద్రవ్యలభ్యత పెంచే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ను దెబ్బతీసిందన్నారు. మూలధన వ్యయంలో కోతలు తప్పవని, నిరర్థక ఆస్తులు సైతం పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాల్గా నిలిచిందన్నారు.