India GDP: దూకుడు పెంచిన భారత్.. గాడిలో పుడుతున్న ఆర్థికం.. కానీ ఆందోళన కరంగా..
India GDP: భారత్ కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే 13.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయానికి జీడీపీ 20.1గా నమోదైంది. అయితే గడచిన జనవరి నుండి మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు 4.1 శాతం మేర వృద్ధి చెందింది. అయితే ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ విస్తృతంగా అంచనా వేసిన దాని కంటే వాస్తవ గణాంకాలు తక్కువగా నమోదయ్యాయి.
అంచనాలు ఇలా..
దేశ జీడీపీపై అనేక సంస్థలు అందించిన అంచనాల గణాంకాలు ఇలా ఉన్నాయి. రేటింగ్ సంస్థ ఇక్రా వృద్ధి రేటును 13 శాతంగా అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15.7 శాతం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 16.2 శాతం, రాయిటర్స్ వార్తా సంస్థ 15.2 శాతం, బ్లూమ్ బెర్గ్ 15.3 శాతంగా వృద్ధి ఉండవచ్చని గతంలో అంచనా వేశాయి. ఇదే క్రమంలో పొరుగున ఉన్న డ్రాగన్ దేశం చైనా వృద్ధి కేవలం 0.4 శాతంగా ఉంది.
వేగంగా సర్వీస్ సెక్టార్..
కరోనాతో కొంత అనేక రంగాలు నెమ్మదించాయి. అయితే మెుదటి త్రైమాసికంలో ముఖ్యంగా సేవల రంగంలో డిమాండ్ పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రజలు ఖర్చు చేసేందుకు బయటకు రావటం, దీనికి తోడు రానున్న మాసాల్లో పండుగలు ఉండటం కారణంగా డిమాండ్ మరింతగా ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆందోళనకరంగా తయారీ రంగం..
ప్రస్తుతం దేశంలోని తయారీ రంగంలో వృద్ధి 4.8 శాతానికి దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా ఎగుమతుల కంటే దిగుమతులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మరో పక్క రూపాయి విలువ పడిపోవటం డాలర్ పుంజుకోవటం దిగుమతులను మరింత ఖరీదుగా మారుస్తోంది. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ వద్ద ఫారెక్స్ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. GDP మెరుగుపడటంతో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెట్టగలదు. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ సంతృప్తికరమైన స్థాయి 6 శాతానికి ఎగువన కొనసాగుతోంది.