భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే ఫాస్ట్ రికవరీ: ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్
భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు సహా వివిధ కారణాలతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవచ్చునని పేర్కొంది. వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చినట్లు తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించడంతో పాటు మూడీస్ కూడా ఇటీవల వృద్ధిరేటును సడలించింది. గతంలో కంటే తక్కువ ప్రతికూలత నమోదును అంచనా వేసింది. తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ వేగవంత రికవరీని అంచనా వేస్తోంది.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం మార్చి 31 వరకు పొడిగింపు: MSME,ముద్రా, ఇండివిడ్యువల్స్కు..
వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం లేదు
2020లో క్షీణత రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6 శాతం నుండి మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కఠిన, దీర్ఘకాల లాక్డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్భణం అదుపులోకి రాని నేపథ్యంలో రెపో రేటు మరింత తగ్గించే అవకాశాలు లేవని అభిప్రాయపడింది. ద్రవ్యోల్భణం 6 శాతానికి పైన ఉండే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకపోవచ్చునని తెలిపింది.
అన్ని రంగాల్లో ధరల పెరుగుదల
వినిమయ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో కరోనా ముందుస్థాయికి వచ్చిందని, ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాల్లో ధరల పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్భణం అధికంగానే ఉండవచ్చునని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు వంటి ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో ((7.61 శాతం) ఆరున్నర సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ఆర్బీఐ 2 శాతం నుండి 4 శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిని మించింది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7.27 శాతంగా నమోదయింది.
వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తే..
అదే సమయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తెలిపింది. అందువల్ల ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపు ముగింపు దశకు చేరినట్లేనని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇప్పటికే స్థిర డిపాజిట్ రేటు 4.90 శాతం నుండి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇది నెగెటివ్ రిటర్న్స్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వడ్డీ రేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రమైతే అది సేవింగ్స్, డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్ పైన ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని చెబుతున్నారు.