2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతానికి క్షీణించింది. దేశ చరిత్రలో అత్యంత దారుణ పతనం ఇది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల పరిస్థితి కూడా ఇదే. అమెరికా, బ్రిటన్, జపాన్, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. దాదాపు దశాబ్ద ప్రపంచ వృద్ధి వెనుకబడిందని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రభుత్వం చర్యలతో భారత్ వేగంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు భారత, ప్రపంచ వృద్ధిపై అంచనాలు వేస్తున్నాయి. తాజాగా 2021 క్యాలెండర్ ఏడాదిలో భారత్ వృద్ధి 7.3 శాతానికి చేరుకుంటుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేస్తోంది.
భారీ క్షీణత నుండి భారీ వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో వృద్ధి మైనస్ 9.6 శాతంగా ఉండగా, 2021లో 7.3 శాతం వృద్ధి నమోదు కావొచ్చునని ఐక్య రాజ్య సమితి తెలిపింది. ఈ మేరకు 'వరల్డ్ ఎకనమిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2021 రిపోర్ట్'ను ఐక్య రాజ్య సమితి సోమవారం విడుదల చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ, ద్రవ్య ఉద్దీపన ప్రకటించినప్పటికీ లాక్డౌన్ వంటి కారణాలతో జీడీపీ భారీగా క్షీణించినట్లు తెలిపింది. దేశీయ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని తెలిపింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధి రేటు 5.9 శాతంగా నమోదవుతుందని ఐక్య రాజ్య సమితి నివేదిక తెలిపింది.
2020లో చైనా ఒక్కటే పాజిటివ్గా
కరోనా పుట్టింది చైనాలోనే. ఆ దేశంలో 2020 క్యాలెండర్ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి క్షీణించింది. అయితే ఆ తర్వాత క్రమంగా పట్టాలెక్కింది. దీంతో గరత ఏడాది వృద్ధి రేటు పాజిటివ్గా ఉన్న దేశం చైనా మాత్రమేనని తెలిపింది. చైనా వృద్ధి రేటు 2020లో 2.4 శాతం కాగా, 2022లో 7.2 శాతంగా ఉంటుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. 2022లో 5.8 శాతంగా ఉంటుందని పేర్కొంది.
చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
2020లో ప్రపంచ వృద్ధి రేటు మైనస్ 4.3 శాతం కాగా, ఈ ఏడాది ప్లస్ 4.7 శాతంగా ఉంటుందని, వచ్చే ఏడాది ప్లస్ 5.9 శాతంగా ఉంటుందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిందని, ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయని, మెజార్టీ ప్రపంచంలో వృద్ధి నెమ్మదిగా కనిపిస్తోందని ఐక్య రాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ ఎలియోట్ హారిస్ తెలిపారు. వ్యాక్సినైజేషన్ రాక, కరోనా నుండి ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఆర్థికంగా దెబ్బతినేలా కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, అలా అయితే ఆర్థిక వ్యవస్థలు చితికిపోతాయని హెచ్చరించారు. పలు దేశాలు ఇటీవల మళ్లీ లాక్ డౌన్ వంటి నిర్ణయాలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్చరించారు. వ్యాక్సినైజేషన్ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రోత్సహించాలన్నారు.