Koo vs Twitter: బ్రెజిల్ లో మోతమోగిస్తున్న Koo.. ట్విట్టర్ కి చుక్కలేనా.. కేవలం రెండు రోజుల్లో..
Koo vs Twitter: ఎలాన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులే కాక ఇప్పుడు వినియోగదారులు సైతం ఫ్లాట్ ఫారమ్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం దీనినే భారత మైక్రో బ్లాగింగ్ సైట్ Kooకు భారీగా కలిసొచ్చింది.
గందరగోళంలో..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో గందరగోళం నెలకొంది. ఈ కారణంగా దానికి దూరమవుతున్న వినియోగదారులు భారతీయ కంపెనీకి దగ్గరవుతున్నారు. అవును ప్రస్తుతం కూ విదేశాల్లో సైతం బాగా పాపులర్ అవుతూ.. ప్రజలకు బాగా దగ్గర అవుతోంది. Koo యాప్ బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే పది లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవటం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అంతర్జాతీయ కంపెనీకి మేమేం తక్కువ కాదంటూ ముందుకు సాగుతోంది. అనేక ప్రపంచ భాషల్లో ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని Koo లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచ భాషల్లో..
భారతదేశంలోని బహుభాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ అయిన కూ యాప్ బ్రెజిల్లో పోర్చుగీస్ భాషతో ప్రారంభించబడిందని కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యాప్ 11 ఒరిజినల్ భాషల్లో తన సేవలను అందిస్తోంది. తమ సేవలకు విశేష స్పందన రావటంపై కూ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంది. స్థానిక భాషల్లో మాట్లాడే ప్రజల సమస్యలకు రానున్న కాలంలో పరిష్కరించేందుకు కంపెనీ ప్రయత్నాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
తలకిందులైన ట్విట్టర్..
ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ ఎలాన్ మస్క్ కొనుగోలు ట్విట్టర్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కంపెనీలో గందరగోళం నెలకొంది. మస్క్ గతంలో కంపెనీ భారత సంతతికి చెందిన సీఈవో పరాగ్ అగర్వాల్తో సహా పలువురు ఉన్నతాధికారులను తొలగించారు. ఆ తర్వాత ఆదాయం తగ్గిందంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. భారతదేశంలో పనిచేస్తున్న వారిలో ఏకంగా 90 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కంపెనీ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్న తరుణంలో 'కూ' అదరగొడుతోంది.