అతి తక్కువ ధరకే క్రూడాయిల్, భారత్ నిల్వలతో 685 మిలియన్ డాలర్ల ఆదా
కరోనా మహమ్మారి కారణంగా కొద్ది నెలల క్రితం చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ నెలలో ఓ సమయంలో సున్నాస్థాయికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా చమురు డిమాండ్ పడిపోయి, ధరలు పతనమయ్యాయి. సౌదీ అరేబియా, యూఏఈలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ధరలు తగ్గించాయి. దీనిని భారత్ సద్వినియోగం చేసుకొని, సాధ్యమైనంత మేర తన వ్యూహాత్మక చమురు నిల్వలను నింపింది. అత్యవసర సమయాల్లో ఇంధన అవసరాలను తీర్చడానికి రిజర్వ్లు తక్కువ ధరకు నింపడం ద్వారా ఈ ప్రక్రియలో భారత్ 685.11 మిలియన్ డాలర్ల మేర ఆదా చేసింది.
2 లక్షలకోట్ల డాలర్లు.. ప్రపంచదిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదలీ కలకలం, షేర్లు 1998 స్థాయికి..
ఫ్యూచర్ మార్కెట్ ధర
భారత్ ముడి చమురును బ్యారెల్ ధర సగటున 19 డాలర్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్-మే నెలల్లో ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్న సమయంలోనూ వీటిని ఫిల్ చేసింది. ఆ సమయంలో యూఎస్ ఫ్యూచర్ మార్కెట్ ధర నెగిటివ్లోకి వెళ్లాయి. ఈ నిల్వలు స్వల్పకాలిక సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు ఉద్దేశించినవి. భారత్లో 9.5 రోజుల అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉంటాయి. దేశంలో 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, అప్పటికే సగం వరకు నిండి ఉన్నాయి.
విశాఖ సహా ఈ ప్రాంతాల్లో నిల్వలు
ఇండియా స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్(ISPRL) ఆధ్వర్యంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉంటాయి. దేశంలో మూడు ప్రాంతాల్లో విశాఖపట్నం(1.33 మిలియన్ టన్నులు), మంగళూరు(1.5 మిలియన్ టన్నులు), పాడూర్(2.5 మిలియన్ టన్నులు)లో రిజర్వ్స్ ఉన్నాయి.
6.5 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రిజర్వ్స్ కర్నాటకలోని పాడూర్, జైపూర్-చండిఖోలేలో నిర్మిస్తున్నారు. రాజస్థాన్లోని బికనూర్, గుజరాత్లోని రాజ్కోట్లో త్వరలో నిర్మించనున్నారు.
100 రోజులకు సరిపడా నిల్వల కోసం ప్రణాళికలు
ఇప్పటికే ఉన్న రిజర్వ్స్కు తోడు ప్రస్తుత ప్రతిపాదనలోని రిజర్వ్స్ పూర్తయితే దేశంలో నెల రోజులకు సరిపడా అవసరాలను తీర్చే చమురు నిల్వలు ఉంటాయి. అంతేకాదు, దేశ అవసరాలకు 90 రోజుల నుండి 100 రోజులకు సరిపడా ఇంధన నిల్వల కోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. మరిన్ని కొత్త నిల్వ ప్రాంతాలను గుర్తించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ISPRLకు సూచించింది. వ్యూహాత్మక చమురు నిల్వలు ఎక్కువగా ఉంటే ధరలు పడిపోయిన సందర్భాల్లో ఖజానా పొదుపు అవుతుంది.
పాదూర్లోని 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంలో సగాన్ని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ADNOC)కి లీజుకు ఇవ్వడానికి ISPRL ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఇక్కడ 25 శాతాన్ని లీజుకు ఇచ్చేందుకు సౌదీ ఆరామ్కోతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మంగళూరు నిల్వ సామర్థ్యం 1.5 మిలియన్ టన్నుల్లో సగాన్ని ADNOCకు లీజుకు ఇచ్చింది. మరో ఒపెక్ దేశం ఇరాక్ చమురుతో విశాఖ రిజర్వ్ సామర్థ్యంలో 1.03 మిలియన్ టన్నులు నింపింది.