డ్రాగన్తో మళ్ళీ సంబంధాలు, చైనా పెట్టుబడులకు భారత్ ఓకే కానీ!
న్యూఢిల్లీ: చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మన దేశంలో మళ్ళీ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. చైనాకు చెందిన 45 పెట్టుబడుల ప్రతిపాదనలను భారత్ క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో గ్రెట్ వాల్ మోటార్, ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ ఉన్నాయి. గత ఏడాది ప్రారంభంలో భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల అనంతరం చైనా కంపెనీలను, చైనా పెట్టుబడులపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలు విధించిన తొమ్మిది నెలల అనంతరం ఇప్పుడు ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
SBI gold loan: మిస్డ్ కాల్ ఇస్తే చాలు... అర్హత, వడ్డీ రేటు ఎంత తక్కువ అంటే?
కేస్ బై కేస్ విశ్లేషించి అనుమతి
చైనా FDI ప్రతిపాదనలకు దాదాపు 9 నెలల నుండి అనుమతులను నిలిపివేసిన కేంద్రం ఇప్పుడు ఒక్కో ప్రతిపాదనకు కేస్ బై కేస్ పద్ధతిలో అంటే విడివిడిగా అనుమతులివ్వడం ప్రారంభించింది. సరిహద్దు వద్ద ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో చైనాకు చెందిన 45 పెట్టుబడి ప్రతిపాదనలకు అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో గ్రేట్ వాల్ మోటర్, SAIC మోటర్ కార్పొరేషన్ తదితర కంపెనీలు ఉన్నాయి. వాస్తవానికి గత కొన్ని వారాల నుండే ఈ అనుమతులు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు చిన్న పెట్టుబడులకే ఈ అనుమతులు పరిమితమయ్యాయని వార్తలు వస్తున్నాయి. అన్నింటిని విశ్లేషించిన అనంతరం పెద్ద ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెబుతున్నారు.
మరింత సరళతరం
అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. నీతి ఆయోగ్తో పాటు కేంద్రహోం, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులతో ఈ కమిటీ ఏర్పాటయింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిశీలన బోర్డు కాదని, పొరుగు దేశాల నుండి వచ్చే FDI ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలే స్వయంగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటాయి.
ఘర్షణ కారణంగా..
గత ఏడాది గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో రెండువైపులా ప్రాణనష్టం జరిగింది. మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు అమరులయ్యారు. దీంతో దేశంలోకి చైనా పెట్టుబడులపై నియంత్రణ నిబంధనలను కేంద్రం కఠినం చేసింది. 200 కోట్ల డాలర్లకు పైగా సుమారు 150 పెట్టుబడి ప్రతిపాదనలు చైనా నుండి వచ్చాయి. హాంగ్కాంగ్ మీదుగా వచ్చే అమెరికా, జపాన్ పెట్టుబడుల మాదిరి చైనా కంపెనీల పెట్టుబడులకు అంతర్గత మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపాలని నాడు కేంద్రం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ఇబ్బందిలేని రంగాల్లో 45కు పైగా చెనా కంపెనీల పెట్టుబడులను అనుమతించాలని తాజాగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.