చైనా విద్యుత్ సామాగ్రితో జాగ్రత్త, అదే జరిగితే పెను ప్రమాదం!
చైనా నుండి దిగుమతి అయ్యే విద్యుత్ పరికరాలతో అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ సంస్థలు వినియోగించే వాటిలో మాల్వేర్, ట్రోజన్ హార్స్ను ప్రవేశపెట్టి డ్రాగన్ దేశం విక్రయించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సామాగ్రి భారత్ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానమైతే సంక్షోభ సమయంలో చైనా అవి కుప్పకూలేటట్లు చేస్తుందని హెచ్చరించింది. చైనా నుండి కొనుగోలు చేసిన అన్ని విద్యుత్ పరికరాలను భారత్ తనిఖీ చేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆదివారం తెలిపారు.
బాయ్కాట్ చైనా దెబ్బ: శాంసంగ్కు కలిసొచ్చిన యాంటీ చైనా సెంటిమెంట్!
దిగుమతులు తగ్గించే దిశగా
ఇప్పటికే దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని, దేశీయ తయారీని పెంచాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక టారిఫ్తో పాటు నాణ్యతా నియంత్రణ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో వినియోగించే పరికరాలపై ఈ ఛార్జీలు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే సింగ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా నుండి వచ్చే విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. లేదంటే క్లిష్ట సమయంలో ఈ సామాగ్రి మన విద్యుత్ గ్రిడ్తో అనుసంధానమైతే సంక్షోభ సమయంలో చైనా వాటిని కుప్పకూల్చేస్తుందన్నారు.
శత్రు దేశానికి దెబ్బతీసే అవకాశం ఇవ్వొద్దు
విద్యుత్ రంగం అత్యంత వ్యూహాత్మకమైనదని, దేశంలోని కంపెనీలు, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు దీనిపై ఆధారపడి ఉంటాయని ఆర్కే సింగ్ చెప్పారు. ఏదైనా శత్రుదేశం ఈ మార్గంలో భారత్ను దెబ్బతీసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోను ఇవ్వకూడదని, అలా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు అడ్డుగా ఓ ఫైర్ వాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. మరింత టారిఫ్, విదేశీ పరికరాల కఠిన పరీక్ష, శత్రు దేశాల నుండి దిగుమతుల కోసం ముందస్తు అనుమతి వంటి వాటిని ముఖ్యంగా విద్యుత్ రంగం వాటి వాటికి అవసరమని అభిప్రాయపడ్డారు.
అలా ఉంటే ప్రమాదం
మాల్వేర్, ట్రోజన్ హార్స్ ఉండవచ్చునని తమకు సమాచారం ఉందని, అలా ఉంటే విద్యుత్ రంగం, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ సున్నిత రంగంలో భారతీయ పరికరాలు ఉండేలా చూస్తామని, ఒకవేళ దిగుమతులు అవసరమైతే పూర్తిస్థాయిలో తనిఖీలు ఉంటాయన్నారు. మన విద్యుత్ రంగంపై ఇప్పటికే పలుమార్లు సైబర్ దాడులు జరిగాయని, వీటిలో అత్యధిక భాగం రష్యా, చైనా, సింగపూర్, కామన్వెల్త్ దేసాల నుండి జరిగినట్లు గుర్తించారు.
సైబర్ ముప్పు కోసం కమిటీ
సైబర్ ముప్పును పసిగట్టేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కింద ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్కే సింగ్ తెలిపారు. మాల్వేర్, ట్రోజన్ హార్స్ తదితర మార్గాల్లో శత్రుదేశం మన విద్యుత్ సరఫరాను నిలిపివేయవచ్చునని, అందుకే ఇది చాలా సున్నితమైన, వ్యూహాత్మక రంగం అన్నారు. ఎందుకంటే డిఫెన్స్ ఇండస్ట్రీ సహా అన్ని పరిశ్రమలు దీని ఆధారంగానే నడుస్తాయని చెప్పారు. కరెంట్ పోతే అప్పుడు మన వద్ద కేవలం 12 నుండి 24 గంటల మాత్రమే నిల్వ ఉంటుందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం అన్నారు.
సోలార్ మాడ్యూల్స్ పైన సుంకం పెంపు
ఆగస్ట్ నుండి సోలార్ మాడ్యుల్స్ పైన 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్ 2022 నాటికి దీనిని 40 శాతానికి పెంచవచ్చు. మన దేశానికి సోలార్ మాడ్యూల్స్ 80 శాతం చైనా నుండి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇది జూలై చివరితో ముగుస్తుంది. అందుకే అప్పటి నుండి 25 శాతానికి పెంచనుంది.