జపాన్ను దాటి 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్! నరేంద్ర మోడీ కల ఆలస్యం..
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్ రానున్న ముప్పై ఏళ్లలో జపాన్ను దాటేసి ముందుకు వెళ్తుందని, మూడో స్థానానికి ఎగబాకుతుందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాత భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2050 నాటికి జర్మనీ, జపాన్లను దాటి భారత్ మూడో స్థానానికి ఎగబాకుతుందని లాన్సెట్ అభిప్రాయపడింది. 2100 సంవత్సరం నాటికి కూడా మూడో స్థానంలోనే కొనసాగుతుందని లాన్సెట్ తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోంతో చిక్కులెన్నో, నిద్రిస్తున్నట్లుగా: సత్య నాదెళ్ల
2050 మూడో స్థానానికి భారత్
2017 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్న లాన్సెట్ భారత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వెల్లడించింది. 2030 సంవత్సరం నాటికి అమెరికా, చైనా, జపాన్ తర్వాత నాలుగో స్థానానికి చేరుకుంటుందని వెల్లడించింద. 2050 నాటికి జపాన్ను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇప్పుడు భారత్ ఐదో స్థానంలో ఉండగా, ఆరో స్థానంలో బ్రిటన్, ఏడో స్థానంలో ఫ్రాన్స్, ఎనిమిదో స్థానంలో ఇటలీ ఉన్నాయి.
మోడీ కల ఆలస్యం
భారత్ టార్గెట్ కూడా ఈ లైన్లోనే ఉంది. 2047 నాటికి భారత్ ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి అయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. అయితే గత అంచనాలతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా మహమ్మారి. గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదలైన జపాన్ సెంటర్ ఫర్ ఎకనమిక్ రీసెర్చ్ ప్రకారం 2029 నాటికి జపాన్ను భారత్ దాటేసి 3వ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇప్పుడు కరోనా వల్ల మరింత ఆలస్యం కానుంది. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత ప్రతిష్టాత్మక లక్ష్యం కూడా మహమ్మారి వల్ల ఆలస్యం కానుంది. 2025 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోడీ కలలు కంటున్నారు.
భారత్లో ఎక్కువ వర్కింగ్ ఫోర్స్
వివిధ దేశాల్లోని శ్రామిక జనాభా వల్ల ఆయా దేశాల జీడీపీలో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకొని లాన్సెట్ అంచనా వేసింది. మున్ముందు చైనాతోపాటు భారత్లో శ్రామిక జనాభా సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, అయినప్పటికీ శ్రామికుల సంఖ్యా పరంగా భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని పేర్కొంది. 2100 సంవత్సరం నాటికి కూడా శ్రామికజనులు భారత్లో ఎక్కువగా ఉంటారని, ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా, చైనా, అమెరికా నిలుస్తాయని తెలిపింది. 2100 నాటికి జపాన్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని తెలిపింది.