భారత్లో 3 ఏళ్ల గరిష్టానికి పెరిగిన నిరుద్యోగం, వారిపై భారీ ప్రభావం
న్యూఢిల్లీ: గత నెల అక్టోబర్లో భారత్లో నిరుద్యోగం భారీగా పెరిగింది. 8.5 శాతంతో ఏకంగా మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2016 ఆగస్ట్ నెల నుంచి ఇదే అత్యధికం. సెప్టెంబర్ నెలలో 7.2 శాతంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కనిపిస్తున్నాయి. భారత్లోను ఈ ప్రభావం కారణంగా నిరుద్యోగిత శాతం పెరిగింది. నిరుద్యోగ రేటు ఆర్థికమాంద్యం ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Gold Amnesty: బంగారంపై పన్ను.. అమలు అసాధ్యం, ఎందుకంటే!
కీలక రంగాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది
దేశంలోని కీలక రంగాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. సెప్టెంబర్ నెలలో ఉత్పత్తి 5.2 శాతం క్షీణించింది. దశాబ్దంలోనే ఇది అత్యంత క్షీణత. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే కీలక రంగాల ఉత్పత్తిలో 4.3 శాతం వృద్ధి నమోదు కాగా, ఈసారి అంతకుమించి తగ్గింది. ఇండస్ట్రియల్ ఔట్ పుట్ ఆగస్ట్ నెలలో ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది.
అందుకే నిరుద్యోగం పెరిగింది..
దేశవ్యాప్తంగా తయారీ రంగ కార్యకలాపాలు అక్టోబర్ నెలలోనే బలహీనంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 51.4 శాతం కాగా, అక్టోబర్ నెలలో ఈ సూచీ రెండేళ్ల కనిష్టానికి తగ్గి 50.6 శాతంగా నమోదయింది. కొనుగోళ్లు లేకపోవడంతో కంపెనీల్లో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో తయారీ రంగం క్షీణించింది. ఈ కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన ఆరు నెలల కనిష్టానికి తగ్గిపోయింది. దీంతో నిరుద్యోగ రేటు పెరిగింది.
అసంఘటిత రంగంపై ప్రభావం
సరాసరిగా ప్రతి ఎనిమిది ఉత్పాదక కంపెనీల్లో ఏడింటి ఉత్పత్తి అక్టోబర్ నెలలో తగ్గిపోయింది. భారత్లో నిరుద్యోగ రేటు క్రమంగా అసంఘటిత రంగ సెక్టార్ను భారీగా ప్రభావం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అసంఘటిత రంగాన్ని దెబ్బతీయడం అంటే ప్రధానంగా రోజువారీ కూలీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.