కరోనా సమయంలో 11 శాతం పెరిగిన భారత సంపద సృష్టి, 3.4 ట్రిలియన్ డాలర్లకు..
కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో ఆర్థిక సంపద ఏకంగా 11 శాతం పెరిగింది. తద్వారా 3.4 లక్షల కోట్ల డాలర్లు లేదా రూ.250 లక్షల కోట్లను తాకింది. కరోనా విజృంభణ సమయంలోను సంపద సృష్టిలో భారత్ దూకుడు కనబరిచినట్లు గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం విడుదలైన నివేదిక ప్రకారం 2020 ప్రారంభంలో కోవిడ్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడినప్పటికీ, ఈ ఏప్రిల్ నుండి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు పేర్కొంది. వ్యక్తులు లేదా పౌరుల భూములు,భవనాలు తదితర రియల్ ఆస్తులు, రుణ బకాయిలు కానిది ఈ ఆర్థిక సంపదగా పేర్కొంది.
మున్ముందు ఆర్థిక సంపద పెరుగుదల
భవిష్యత్తులోను భారత్లో ఆర్థిక సంపద వేగంగా పెరగనుందని, అయితే, ఈ సంపద వృద్ధి రేటు మాత్రం కాస్త తగ్గి పది శాతానికి పరిమితం కావొచ్చునని తెలిపింది. 2025 నాటికి భారత వయోజనుల మొత్తం ధన సంపద 5.5 లక్షల కోట్ల డాలర్లు లేదా దాదాపు రూ.412 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని అంచనా. 2025 వరకు పది కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య భారత్లోనే అధికంగా వృద్ధి చెందనుంది. ఈ అయిదేళ్లలో వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయి 1400కు చేరుకోవచ్చునని అంచనా.
రియల్ అసెట్స్
భారతీయుల క్రాస్ బోర్డర్ వెల్త్ గత ఏడాదిలో 19400 కోట్ల డాలర్లకు పెరిగింది. మొత్తం ధన సంపత్తిలో 5.7 శాతానికి ఇది సమానం. 2025 నాటికి 6.3 శాతానికి పెరగవచ్చునని అంచనా. దేశంలో దాదాపు సగం ధన సంపత్తి నగదు, డిపాజిట్స్, షేర్లు, జీవిత బీమా పెట్టుబడుల రూపంలో ఉంది. రియల్ ఎస్టేట్, విలువైన గృహోపకరణాలు, బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలో ఉన్న ఆస్తులను రియల్ అస్టేట్స్గా నిర్వహించింది.
రియల్ అసెట్స్
గత ఏడాది చివరి నాటికి భారతీయుల రియల్ అసెట్స్ వ్యాల్యూ ప్రస్తుత ధరల ప్రకారం 14 శాతం పెరిగి 12.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. వచ్చే అయిదేళ్ల కాలంలో 18.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా.
దాదాపు సగం ఫైనాన్షియల్ వెల్త్ కరెన్సీ, డిపాజిట్స్గా ఉంది. ఆ తర్వాత ఈక్విటీస్, లైఫ్ ఇన్సురెన్స్ రూపంలో ఉన్నాయి.