భారత్ సహా మన భవిష్యత్తు సూపర్, ఐనా వేతనాలు పెంచాం: ఎకానమీపై HDFC ఎండీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్త క్షీణించిపోతోంది. ఈ ఏడాది వృద్ధి ప్రతికూలత నమోదు చేస్తుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో యూ ఆకారంలో లేదా డబ్ల్యూ ఆకారంలో లేదా జెడ్ ఆకారంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని చెబుతున్నారు. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్యపురి మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై స్పందించారు.
చైనా పెట్టుబడులు: మన స్టార్టప్స్కు దెబ్బ.. అలా చేస్తే ఇబ్బందికరమే!
భారత్ చాలా వేగంగా పుంజుకుంటుంది
భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటుందని ఆదిత్యపురి అన్నారు. వృద్ధి రేటును కరోనాకు ముందుస్థాయిలో తిరిగి పొందడం అవశ్యమన్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని బ్యాంకు బలంగా నిలబడిందని ఉద్యోగులకు ఈ నెల ప్రారంభంలో పంపిన ఈ-మెయిల్ సందేశంలో వెల్లడించారు. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో జీడీపీ 5 శాతం క్షీణిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఆపరేట్ చేయగలిగింది. ఈ నేపథ్యంలో భారత జీడీపీ వేగంగా పుంజుకుంటుందని దిగ్గజ బ్యాంకు ఎండీ చెప్పారు.
ఈ రెండింటి భవిష్యత్తు ఉజ్వలంగా
కరోనా సంక్షోభం చాలా తీవ్రమైనదని, నిర్ణీత కాలవ్యవధిలో సరఫరాను, డిమాండ్ను ఇది చంపేసిందని, కానీ భారత్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. దేశం కరోనా నుండి చాలా వేగంగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు నమ్మకం ఉందని, కరోనా నుండి వేగంగా బయటకు వస్తామన్నారు.
ఆ సంస్థలే లీడర్లుగా నిలుస్తాయి
కరోనా సంక్షోభం తర్వాత మంచి వ్యూహాలు, టెక్నాలజీ, మూలధనం, నగదు లభ్యత, లీడర్షిప్ కలిగిన కంపెనీలు విజేతగా నిలుస్తాయని ఆదిత్యపురి చెప్పారు. ప్రస్తుత క్లిష్ట సమయంలోను బ్యాంకు ఉద్యోగులకు బోనస్, వేతనాల పెంపు కొనసాగించినట్లు తెలిపారు. కాగా, అంతకుముందు ఫిచ్ రేటింగ్ భారత వృద్ధి రేటును ప్రతికూలానికి సవరించింది. అంతకుముందు మూడీస్ కూడా ఇదే వెల్లడించింది. అయితే 2022 ఆర్థిక సంవత్సరం మాత్రం భారీ వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ఇప్పుడు ఆదిత్యపురి కూడా వేగంగా పుంజుకుంటుందని చెప్పారు.