150 ఏళ్లలో.. భారత్ ఆర్థిక పరిస్థితి దారుణం, ప్రపంచం పరిస్థితి మరీ ఘోరం: ప్రపంచ బ్యాంకు
కరోనా మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత్ మైనస్ 3. శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. కరోనా, దీని కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడిందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మైనస్ 5.2 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది.
అన్-లాక్: భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు, ఎలా కోలుకుంటుంది?
1870 తర్వాత అతిపెద్ద మాంద్యం
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో ప్రపంచదేశాలు షట్ డౌన్ విధించాయి. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి, వ్యవస్థలు కుప్పకూలాయి. దీంతో 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ తెలిపారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రభావం చూపగలిగిన ఆర్థిక సహకారం అందించడం కష్టమేనని తెలిపింది. ఈ దేశాల్లో అసంఘటిత రంగాల్లోనే ఎక్కువగా ఉపాధి ఉందని గుర్తు చేసింది. ఈ దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. 60 ఏళ్లలో ఇంతలా ప్రభావం ఇదే తొలిసారి అని తెలిపింది.
2021లో భారత్ పుంజుకుంటుంది
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు భారీగా దెబ్బతిన్నప్పటికీ, 2021 క్యాలెండర్ ఇయర్కు మాత్రం తిరిగి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారత వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 4.2 శాతం, ఈ ఆర్థిక సంవత్సరం 3.2 శాతం తగ్గుతుందని అంచనా వేయబడిందని తెలిపింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, ఫిచ్, ఎస్ అండ్ పీ కూడా ఆర్థిక వ్యవస్థ 4 శాతం నుండి 5 శాతం వరకు ప్రతికూల వృద్ధిని సాధిస్తాయని అంచనా వేశాయి. దేశానికి ఇది నాలుగో అతిపెద్ద మాంద్యమని, స్వాతంత్రం తర్వాత తొలి తిరోగమనమని క్రిసిల్ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ఓకే కానీ ప్రపంచం ప్రభావం
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించడంతో పాటు ద్రవ్యపరంగా ఆర్బీఐ కొన్ని మద్దతు చర్యలు ప్రకటించినప్పటికీ ప్రపంచ వృద్ధిలో బలహీనతల ప్రభావం భారత్పై పడకతప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత వృద్ధి రేటు ప్రభావం ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక పరిస్థితులు సులభతరం చేసేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రభుత్వ బాండ్స్ కొనుగోలు చేస్తుంది. కరోనాపై పోరుకు హెల్త్కేర్పై ఎక్కువగా ఖర్చు చేస్తోందని, స్వల్ప, మధ్య ఆదాయ కుటుంబాలకు నగదు బదలీ, వేతన మద్దతు, పన్ను చెల్లింపులు వాయిదా వేయడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
పెట్టుబడులకు ఇబ్బంది
2018లో భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉందని, 2019లో 6.1 శాతానికి, 2020లో 4.2 శాతానికి తగ్గిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. కానీ కరోనా - లాక్ డౌన్ అసలు ప్రభావం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతున్న ఈ ఆర్థిక సంవత్సరంపై ఉంటుందని, వృద్ధిరేటు మైనస్ 3.2 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. ఈ మహమ్మారి ప్రయివేటు పెట్టుబడులకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిపింది.
తగ్గనున్న తలసరి ఆదాయం
ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం 3.6 శాతం మేర తగ్గవచ్చునని, దీంతో లక్షలమంది అత్యంత పేదరికంలోకి వెళ్ళిపోతారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ఎగుమతి, విదేశీ రుణాలపై ఆధారపడిన ఆయా దేశాల వ్యవస్థలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటాయని వెల్లడించింది. 1870 తర్వాత ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే ఓ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లడే ఇదే మొదటిసారి అని తెలిపింది.
1870 నుండి ఆర్థిక మాంద్యాలు..
అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు మైనస్ 7 శాతం నమోదు కావొచ్చునని, ఆయా దేశాల్లో డిమాండ్, సరఫరా, వాణిజ్యం, రుణ వ్యవస్థలు దెబ్బతినడమే ఇందుకు కారణమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది.
1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 నుండి 1921 వరకు, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చింది.