భారత ఆర్థిక రికవరీపై RBI వ్యాసం ఏం చెప్పిందంటే?
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వ్యాసం వెల్లడించింది. జీఎస్టీ కలెక్షన్లు మొదలు వాహనాల సేల్స్ వరకు అన్నింటా రికవరీ కనిపిస్తోంది. ఇలా భారత వేగవంతమైన రికవరీకి పలు నిదర్శనాలు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే వృద్ధి సానుకూలంగా మారవచ్చునని తెలిపింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో 2020-21 మొదటి త్రైమాసికంలో ఎక్కువ రోజులు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఫస్ట్ క్వార్టర్లో జీడీపీ మైనస్ 23.9 శాతంగా నమోదయింది. రెండో త్రైమాసికంలో మైనస్ 7.5 శాతంగా నమోదయింది.
కొనాలనుకుంటున్నారా.. జనవరి 1 నుండి ఈ వాహనాల ధరలు పెరుగుతున్నాయ్
రెండు అంశాలు దోహదపడ్డాయి
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడానికి ప్రధానంగా రెండు అంశాలు దోహదపడ్డాయని ఆర్బీఐ తన వ్యాసంలో తెలిపింది. సెప్టెంబర్ నుండి కరోనా కేసుల సంఖ్య అదుపులోకి రావడం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ, ఆత్మనిర్భర్ 2.0, 3.0 పథకాలతో వినియోగం, పెట్టుబడులు పుంజుకోవడం దోహద పడ్డాయని తెలిపింది. కొన్ని కీలక సూచీల్లో అంతర్గత నెలకొన్న ధోరణి ప్రకారం చూసినా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ప్రారంభమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
రెండో దశ సంకేతాలు పెద్దగా లేవు
కరోనా వ్యాప్తి రెండో దశ సంకేతాలు పెద్దగా లేవని, ఈ కారణంగా 2020-21 రెండో అర్ధ భాగంలో సానుకూల వృద్ధి ధోరణి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ వ్యాసంలోని అభిప్రాయాలను వ్యాసకర్తల అభిప్రాయంగా చూడాలని కూడా ఆర్బీఐ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8 శాతం నుంచి 14 శాతం వరకు ఉంటుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 0.1 శాతంగా ఉండవచ్చనని తెలిపింది.
అంచనాల సవరణ
ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలో జీడీపీ క్షీణతను రేటింగ్ ఏజెన్సీలు సానుకూలంగా సవరిస్తున్నాయి. గోల్డ్మన్ శాక్స్ వృద్ధి రేటు అంచనాలను మైనస్14.8 శాతం నుండి మైనస్ 10.3 శాతానికి, మూడీస్ మైనస్ 11.5 శాతం నుండి 10.6 శాతానికి సవరించింది.