ఏప్రిల్-నవంబర్ ద్రవ్యలోటు 135 శాతం: ప్రభుత్వ లోటు అలా తగ్గే అవకాశం
2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.10.75 లక్షల కోట్లుగా నమోదయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 135 శాతానికి సమానం. అంటే బడ్జెట్ అంచనాల కంటే 35 శాతం ఎక్కువ. కరోనా వైరస్ నేపథ్యంలో రెవెన్యూ వసూళ్లు పడిపోయిన విషయం తెలిసిందే. ఇది ద్రవ్య లోటు పైన ప్రభావం చూపింది. 2019 నవంబర్ ముగిసే సమయానికి ద్రవ్యలోటు 2019-20 బడ్జెట్ అంచనాల్లో 114.8 శాతంగా నమోదయింది.
చందాదారులకు ఊరట, NPS నుండి ఆన్లైన్ ద్వారా ఎగ్జిట్ కావొచ్చు
ప్రభుత్వం ఖర్చు
ప్రభుత్వ వ్యయంలో కొంత పెరుగుదల ఉంది. FY21లో ద్రవ్యలోటు జీడీపీలో 7.5 శాతం నుండి 9 శాతం మధ్య ఉండవచ్చునని ఆర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా రికవరీ కావాలంటే ప్రభుత్వం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ నాటికి ప్రభుత్వ ఖర్చులు 4.7 శాతం పెరిగి 19.06 లక్షల కోట్లుగా నమోదయింది.
నవంబర్లో ఖర్చు తర్వాత కూడా 2019-20 ఆర్థిక సంవత్సరం 65.3 శాతంతో పోలిస్తే ఇది బడ్జెట్లో 62.7 శాతం. FY20లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంచనాలు 63.3 శాతం కాగా 58.5 శాతంగా ఉంది. గత నవంబర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.7 శాతంగా నమోదయింది.
లోటు తగ్గవచ్చు
FY21లో ప్రభుత్వ మొత్తం ఖర్చులు రూ.30.2 లక్షల కోట్లుగా ఉండవచ్చునని ఇక్రా అంచనా వేసింది. ఇది బడ్జెట్ అంచనాల కంటే తక్కువ. ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ తక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రకటించిన పలు కేటాయింపులు అమలు చేయకపోవచ్చు. అప్పుడు లోటును రూ.1 లక్ష కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు తగ్గించే అవకాశాలు ఉంటాయి.
కరెంట్ ఖాతా లోటు
కాగా 2020-21 రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్ నాటికి దేశీయ కరెంట్ ఖాతా మిగులు 15.5 బిలియన్ డాలర్ల (రూ.1,13,439 కోట్ల)కు తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఇది 2.4 శాతానికి సమానం. తొలి త్రైమాసికంలో 10.8 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు రెండో త్రైమాసికంలో 14.8 బిలియన్ డాలర్ల(రూ.1,08,231 కోట్ల)కు పెరిగినందున కరెంట్ ఖాతా మిగులు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటనలో తెలిపింది.