భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది.. రెండో త్రైమాసికం ప్రశ్నార్థకమే!
కరోనా నుండి భారత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా కోలుకుంటున్నాయి. మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ కారణంగా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్-లాక్ తర్వాత కాస్త కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆర్థిక నిపుణులు ఊహించిన దాని కంటే వేగంగా వ్యవస్థ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును కాస్త సానుకూలంగా సవరిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతికూలంగానే ఉంటుందని చెబుతున్నాయి. తాజాగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(Ind-Ra) జీడీపీని సవరించింది.
కొనాలనుకుంటున్నారా.. జనవరి 1 నుండి ఈ వాహనాల ధరలు పెరుగుతున్నాయ్
రెండో త్రైమాసికం ప్రశ్నార్థకం
FY21లో భారత వృద్ధి రేటును గతంలో మైనస్ 11.8 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 7.8శాతానికి సవరించింది. ప్రభుత్వ అన్-లాక్తో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి సాధించడమే ఇందుకు కారణంగా చెబుతోంది. అందుకే జీడీపీ వృద్ధిరేటును సవరించినట్లు తెలిపింది. అయితే FY21 రెండో త్రైమాసికంలో ఎంత రికవరీ మిగిలిపోయి ఉందనేది ప్రశ్నగానే మిగిలి ఉందని తెలిపింది. ఎందుకంటే రెండో త్రైమాసికం పండుగ సీజన్ కారణంగా కార్యకలాపాల్లో వేగం కనిపించించిందని, కానీ ఇందులో వాస్తవంగా పుంజుకున్నది ఎంతో తేలాల్సి ఉందని అభిప్రాయపడింది. రెండో త్రైమాసికంలో మైనస్ 9 శాతం కంటే ఎక్కువగా అంచనా వేయగా, కాస్త సానుకూలంగా మైనస్ 7.5 శాతంగా నమోదయింది.
అయినా.. అలవాటుపడుతోంది
మాస్ వ్యాక్సినేషన్ వరకు కరోనా ప్రభావం ఉండే అవకాశాలే ఉన్నాయని, అయినప్పటికీ కరోనాకు ప్రపంచ ప్రజానీకం అలవాటు పడుతోందని, దీని నుండి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడింది. దీంతో క్రమంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుంటున్నట్లు వెల్లడించింది. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 0.8 శాతం, నాలుగో త్రైమాసికానికి కాస్త పాజిటివ్గా 0.3 శాతంగా ఉండవచ్చునని వెల్లడించింది. FY22లో వృద్ధిరేటు 9.6 శాతంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
ఈ రంగాల్లో..
కరోనా పరిస్థితుల్లోను వృద్ధి సాధించిన ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. రుతుపవనాలు కూడా సహకరించినట్లు వెల్లడించింది. వ్యవసాయం, పరిశ్రమలు, ఇండస్ట్రీ వరుసగా ప్లస్ 3.5 శాతం, నెగిటివ్ 10.3 శాతం, నెగిటివ్ 9.8 శాతంగా అంచనా వేస్తోంది.