స్మార్ట్ఫోనా..డంపింగ్ యార్డా: మొబైల్ యాప్ డౌన్లోడ్లో భారత్ రెండోస్థానం మరి
న్యూఢిల్లీ: అరచేతిలో స్మార్ట్ఫోన్ల వినియోగం వచ్చిన తరువాత రోజువారీ అవసరాల కోసం కూడా ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర సరుకుల కొనుగోళ్లు కూడా ఒక్క క్లిక్తో పూర్తయిపోతున్నాయి. విమానాల మొదలుకుని.. సినిమా టికెట్ల వరకు స్మార్ట్ఫోన్ల మీదే ఆధారపడుతున్నారు వినియోగదారులు. బిల్లుల చెల్లింపులు సరే సరి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి మూవీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన థియేటర్లకు వెళ్లే పరిస్థితి కూడా లేదు.
రోజువారీ అవసరాలన్నీ యాప్స్ మీదే..
భోజనం చెయ్యాలన్నా స్మార్ట్ఫోన్ల వైపు చూపు సారించే వాతావరణం నెలకొంది. బ్యాంకింగ్ అవసరాలు సైతం స్మార్ట్ఫోన్ల మీదే సాగుతోంది. ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన యాప్స్ పుణ్యమా అంటూ చివరికి మొబైల్ ఫోన్ అనేది ప్లే గ్రౌండ్గా కూడా ఆవిర్భవించింది. ఇలా అనేక అవతారాల్లో స్మార్ట్ ఫోన్లనేవి మన జీవితంలో ప్రధానభాగంగా మారాయి. చివరికి వార్తలు చదువుకోడానికి న్యూస్ పేపర్లు కూడా అక్కర్లేదు. డైలీ హంట్ యాప్ ఓపెన్ చేస్తే.. అన్ని భాషల్లో బోలెడన్ని వార్తలను చదువుకోవచ్చు. అన్ని సెగ్మెంట్స్కు సంబంధించిన వార్తలు ఇందులో లభిస్తాయి.
యాప్ చుట్టూ ప్రపంచం..
ప్రపంచం మొత్తం స్మార్ట్ఫోన్లు, యాప్ల చుట్టే తిరుగుతోందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి ఈ పరిస్థితులన్నీ. ఆయా అవసరాలన్నీ పూర్తి చేసుకోవాలంటే యాప్స్ అవసరం. దేనికదే ప్రత్యేకంగా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్ అనేది ఓ మహా సముద్రంలా మారింది. లెక్కలేనని యాప్స్ కనిపిస్తాయి అందులో. అందుకే- మొబైల్ యాప్స్ డౌన్లోడ్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానాన్ని డ్రాగన్ కంట్రీ చైనా ఆక్రమించింది.
చైనా తరువాత..
ప్రపంచ జనాభాలో ఈ రెండు దేశాలే తొలి, మలి స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. జనాభాకు అనుగుణంగా యాప్స్ డౌన్లోడ్ రికార్డయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది విధించిన లాక్డౌన్ సమయంలో యాప్స్ డౌన్లోడింగ్ అనేది రికార్డు స్థాయిలో నమోదైందని యాప్స్ యాన్నీ అనే ఓ అంతర్జాతీయ సర్వే సంస్థ పేర్కొంది. ఆ ఒక్క సంవత్సరంలోనే 24 బిలియన్ల మేర యాప్స్ డౌన్లోడ్ అయినట్లు తెలిపింది. 2019తో పోల్చుకుంటే 28 శాతం మేర యాప్స్ డౌన్లోడింగ్ పెరిగిందని ఈ సంస్థ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్..
ఇందులో గేమింగ్ యాప్స్ను అత్యధికులు డౌన్లోడ్ చేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సప్, మెసెంజర్, ఫేస్బుక్, ట్విట్టర్ రెండోస్థానంలో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ యాప్ యూట్యూబ్ వాటితో పోటీ పడింది. లాక్డౌన్ పరిస్థితుల వల్ల ప్రజలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టే వాతావరణం లేకపోవడం వల్ల ఆన్లైన్ మీదే ఎక్కువ కాలం గడిపినట్లు యాన్నీ సర్వే పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడానికీ ఇవి ఓ కారణం అయ్యాయని తెలిపింది.
లూడో కింగ్..
ఆన్లైన్ గేమింగ్ సెక్టార్లో అత్యధిక యూజర్లు లూడో కింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు యాన్నీ సర్వే వివరించింది. టాప్ ఫైవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లల్లో ఇది అగ్రస్థానంలో ఉంది. ఫౌజీ: ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్, క్యారమ్ పూల్, జాయిన్ క్లాష్ 3డీ, బబుల్ షూట్ బై ల్లాయన్ మిగిలిన స్థానాల్లో నిలిచాయి. ఫైనాన్షియల్ సర్వీసులకు సంబంధించిన యాప్స్లల్లో అప్స్టాక్స్ ప్రొ అనేది టాప్ ప్లేస్లో నిలిచింది. వజీర్ ఎక్స్, కాయిన్ స్విచ్, కాయిన్ డీసీఎక్స్ ఇన్వెస్టిమెంట్, ధని అనేవి వరుసగా మిగిలిన నాలుగు స్థానాలను ఆక్రమించాయి.