శుభవార్త: మరో కీలక నిర్ణయం దిశగా నరేంద్ర మోడీ, ఒకే దేశం.. ఒకే వేతనం
న్యూఢిల్లీ: అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సంఘటిత రంగంలో పని చేసే కార్మికులు లేదా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఒకేరోజు వేతనం అందేలా చూసేందుకు 'వన్ నేషన్ వన్ పే డే' (ఒకే దేశం-ఒకే వేతన దినం) విధానం అమలు చేసే యోచన చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ అన్నారు.
సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రయివేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వివిధ రంగాల్లోని కార్మికులకు ఒకే సమయంలో వేతనాలు అందేలా చూడటానికి దేశవ్యాప్తంగా ప్రతి నెల వేతన చెల్లింపు రోజు ఒకే తేదీ ఉండాలని చెప్పారు. ఇందుకు చట్టం తీసుకు వచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
వర్కర్స్ మెరుగైన జీవనాన్ని పెంపొందించేందుకు వీలుగా అన్ని రంగాల్లోను ఏకీకృతంగా కనీస వేతనాలు లభించేలా చూడాలనుకుంటున్నామన్నారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతిని అమలు చేసే ప్రక్రియలో కేంద్రం ఉందని చెప్పారు. 44 కాంప్లెక్స్ లేబర్ నిబంధనలు సంస్కరించే పనిలో ఉన్నామన్నారు.